యువతిపై సామూహిక అత్యాచారం చేయించిన మహిళ
మంచినీటిలో మత్తుమందు కలిపి ఇచ్చి.. యువతితో తాగించింది. మత్తులో ఉన్న యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు.
ఆడదే ఆడదానికి శత్రువు అనే సామెత వినే ఉంటారు. దీనిని ఓ మహిళ అక్షరాలా నిజం చేసింది. దగ్గరనుంచి సాటి ఆడపిల్ల అనే కనికరం కూడా లేకుండా నలుగురు యువకులతో సామూహిక అత్యాచారం చేయించింది. ఈ దారుణ సంఘటన ఏపీలో చోటుచేసుకోవడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లాకు చెందిన యువతి(23) ఇంజినీరింగ్ పూర్తి చేసింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం కోసం 2017 జూన్లో నగరానికి వచ్చి ఎల్లారెడ్డిగూడలోని ఓ హాస్టల్ లో ఉండేది. అక్కడి వాతావరణం..భోజనం నచ్చకపోవడంతో జులై 2017లో సమీపంలోని ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా చేరింది. ఆ ఇంటి యజమానురాలు..శిరీష అలియాస్ జయశ్రీని ఆ యువతికి పరిచయం చేసింది.
తనను తాను సంఘసేవకురాలిగా చెప్పుకున్న శిరీష..తనకున్న పరిచయాలతో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికింది. ఉద్యోగం ఇచ్చేవారు వస్తున్నారంటూ 2018 మార్చి 5న యువతిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు తీసుకెళ్లింది. రాత్రంతా వారి కోసం ఎదురుచూస్తున్నట్లుగా నటించింది. వాళ్లు గుంటూరు రమ్మన్నారని నమ్మించి..ఉదయం క్యాబ్లో యువతితో సహా గుంటూరుకు బయలుదేరింది.
మార్గమధ్యలో ఆమిచ్చిన మంచినీళ్లు తాగిన యువతి స్పృహతప్పింది. మెలకువ వచ్చేసరికి కారులో తనతోపాటు నలుగురు వ్యక్తులను గుర్తించిన యువతి ‘వారు తనపై అత్యాచారం చేసినట్లుగా’ నిర్ధారణకు వచ్చింది. వారి బారి నుంచి ఎలాగోలా తప్పించుకొని నగరానికి చేరుకున్న యువతి పరువు పోతుందని భావించి జరిగిన ఘోరాన్ని కడుపులోనే దాచుకుంది.
అత్యాచారానికి సంబంధించి వీడియోలు, చిత్రాలు తమ వద్ద ఉన్నాయంటూ శిరీషతోపాటు..మరి కొందరు ఇటీవల యువతిని బెదిరించడం ఆరంభించారు. తాము పిలిచిన చోటుకు రాకపోతే అవన్నీ యూట్యూబ్లో పెడతామని హెచ్చరించడంతో యువతి మానసిక సంఘర్షణకు గురై ఎట్టకేలకు బుధవారం ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చింది. శిరీష, హేమ, సునీతారెడ్డి తదితరులు తనను మోసగించినట్టు ఎస్సార్నగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.