మోడీ తిరుపతి స్పీచ్: పవన్ కల్యాణ్ ను ఇరికించిన గల్లా జయదేవ్
2014 ఎన్నికల సమయంలో తిరుపతి సభలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఇరికించారు. ఆయనను సాక్షిగా ముందుకు తెచ్చారు.
విజయవాడ: 2014 ఎన్నికల సమయంలో తిరుపతి సభలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఇరికించారు. ఆయనను సాక్షిగా ముందుకు తెచ్చారు.
పవన్ కల్యాణ్ కు, గల్లా జయదేవ్ కు మధ్య గత కొద్ది రోజులుగా ట్విట్టర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ వీడియోలను మార్ఫింగ్ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బిజెపి నాయకులు చేస్తున్న విమర్శలపై గల్లా జయదేవ్ పవన్ కల్యాణ్ ను నిలదీశారు.
తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని చంద్రబాబుతో సహా టీడీపి నాయకులు గత కొద్ది రోజులుగా విమర్శిస్తున్నారు. అయితే తిరుపతి సభలో మోడీ ఆ హామీ ఇవ్వలేదని, టీడీపీ చూపిస్తున్న వీడియోలు మార్ఫింగ్ చేసినవని బిజెపి నాయకులు అంటున్నారు.
బిజెపి నేతల వాదన మీడియాలో వచ్చింది. బిజెపి నేతల వాదనకు సంబంధించి ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని గల్లా జయదేవ్ ట్వీట్టర్ లో షేర్ చేస్తూ పవన్ కల్యాణ్ కు ట్వీట్ చేశారు.
"పవన్ కల్యాణ్ గారూ... ఆ సభలో మీరు కూాడ ఉన్నారు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో తెలిసినప్పుడు మాట ఇచ్చి వెనక్కి తగ్గారని మీరే నేరుగా మోదీని నిలదీయవచ్చు కదా! ఆ రోజు జరిగన దానికి మీరే సాక్ష్యం. మీరే చెప్పండి ఇవి మార్ఫింగ్ వీడియోలా" అని గల్లా జయదేవ్ అడిగారు.