24 గంటలైనా గడవలేదు, అలక: చంద్రబాబుకు తెగేసి చెప్పన గల్లా అరుణ
చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం ఇంచార్జీ బాధ్యతల నుంచి మాజీ మంత్రి గల్లా అరుణ కుమార్ తప్పుకున్నారు.
చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం ఇంచార్జీ బాధ్యతల నుంచి మాజీ మంత్రి గల్లా అరుణ కుమార్ తప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఆమె చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి తన కూతురిని గానీ మరొకరిని గానీ దింపే ఆలోచన తనకు లేదని ఆమె స్పష్టం చేశారు.
మంగళవారం ఆమె పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసి తన నిర్ణయాన్ని చెప్పారు. రాజకీయాల్లో తన కుమారుడు గల్లా జయదేవ్ కు అండగా నిలబడుతానని చెప్పారు. వయోభారం కారణంగా తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె తెలిపారు.
గత నెల 30వ తేదీన ఆమె సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు చంద్రబాబుతో కలిసి తిరుపతిలో ధర్మ పోరాట సభలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ముందు వరుసలో కూర్చున్నారు. నాలుగేళ్ల క్రితం ఇక్కడే జరిగిన బహిరంగ సభలో ప్రత్యేక హోదాపై మోడీ ఇచ్చిన హామీలకు తాను ప్రత్యక్ష సాక్షినని కూడా చెప్పారు ఇది జరిగి 24 గంటలైనా గడవక ముందే మంగళవారం చంద్రబాబును కలిసి తన నిర్ణయాన్ని వెల్లడించారు.
పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆసంతృప్తితో గల్లా అరుణ ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రెండున్నరేళ్ల క్రితం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినప్పుడు తనకు అవకాశం లభిస్తుందని ఆమె అనుకున్నారు. కానీ ఆ అవకాశం గాలి ముద్దుకృష్ణమ నాయుడికి దక్కింది. అప్పటి నుంచి ఆమె అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి పలమనేరులో గెలిచి తెలుగుదేశంలోకి వచ్చిన అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఆమెలో మరింతగా అసంతృప్తి పెరిగిందని అంటున్నారు.