శ్రీగౌతమి కేసు: నలుగురు టీడీపీ నేతల అరెస్ట్
శ్రీగౌతమి కేసులో కీలక నిందితుల అరెస్ట్
ఏలూరు: శ్రీగౌతమి హత్య కేసులో నలుగురు టీడీపీ నేతలను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం నాడు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. పథకం ప్రకారంగానే శ్రీగౌతమిని హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
గత ఏడాది జనవరి 18వ తేదిన శ్రీగౌతమి ఆమె సోదరి పావని స్కూటీపై రాత్రి పూట ఇంటికి వస్తుండగా వెనుక నుండి వాహనంతో ఢీకొట్టి నిందితులు హత్య చేశారు. అయితే ఈ ప్రమాదంలో పావని తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొంది.
ఈ ప్రమాదాన్ని రోడ్డు ప్రమాదంగా పోలీసులు తేల్చి కేసును మూసేశారు. కానీ, పావని ఈ విషయమై పోరాటం చేసింది. దీంతో సీఐడీ అధికారులు కేసును రీ ఓపెన్ చేసి దర్యాప్తు సాగిస్తే దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి.
శ్రీగౌతమిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో నలుగురు టీడీపీ అధికారుల పాత్ర ఉందని సీఐడీ పోలీసులు తేల్చారు.
నర్సాపురం జడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్, టీడీపీ నేత సజ్జా బుజ్జి, స్థానిక టీడీపీ నేతలు ఆండ్రూ, బొల్ల ప్రసాద్లు కీలకంగా వ్యవహరించారని సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు నిందితులను పోలీసులు మంగళవారం నాడు మీడియా ఎదుట హజరుపర్చారు.