వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లనున్న నలుగురు అభ్యర్థులు బుధవారం ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్లు దాఖలు చేశారు. అందులో వారి ఆస్తులు విలువ, కేసుల వివరాలను తెలియజేశారు. అలాగే అప్పులు కూడా పేర్కొన్నారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికారిక పార్టీ అయిన వైసీపీ త‌రుఫున న‌లుగురు అభ్య‌ర్థులు రాజ్య‌స‌భ స‌భ్యులుగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో వారి ఆస్తులు, అప్పులు, కేసులు త‌దిత‌ర వివ‌రాలు అన్నీ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ కు అఫిడ‌విట్ లో పొందుప‌రిచి అంద‌జేశారు. అందులో అభ్య‌ర్థులు పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యుడు, వైసీపీలో ముఖ్య నాయకుడిగా కొన‌సాగుతున్న విజ‌య‌సాయిరెడ్డిపై ప‌లు కేసులు ఉన్నాయి. అందులో 8 ఈడీ న‌మోదు చేసిన‌వి కాగా.. 11 సీబీఐ న‌మోదు చేసిన కేసులు ఉన్నాయి.

ఈ రాజ్య‌స‌భ స్థానాలకు న‌లుగురు నామినేష‌న్లు దాఖలు చేయ‌గా.. వీరంద‌రూ కోటీశ్వ‌రులే కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో బీద మస్తాన్ రావు అత్యంత ధ‌నికుడు కాగా.. బీసీ నేత ఆర్. కృష్ణ‌య్యకే త‌క్కువ ఆస్తులు ఉన్నాయి. బీద మ‌స్తాన్ రావు త‌న ఆస్తుల‌ను 243 కోట్లుగా పేర్కొన్నారు. ఆర్. కృష్ణయ్య త‌న ఆస్తుల‌ను రూ.3.50 కోట్లుగా తెలిపారు. విజ‌య సాయిరెడ్డి త‌న కుటుంబ మొత్తం అస్తిని 21.5 కోట్లుగా పొందుప‌ర్చారు. ఆయ‌నపై ఉన్న 19 కేసులు ప్ర‌స్తుతం కోర్టులో విచార‌ణ‌లో ఉన్నాయి. ఆయ‌నకు రూ.24. 65 ల‌క్ష‌ల అప్పులు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. 

బీద మస్తాన్ రావు త‌న‌కు రూ. 85 కోట్ల రుణాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. మొత్తంగా 93 కోట్ల స్థిరాస్తులు, రూ.150 కోట్ల చ‌రాస్తులు ఉన్న‌ట్టు ఆయ‌న త‌న ఆఫిడ‌విట్ లో పేర్కొన్నారు. ప‌లు చోట్ల ల్యాండ్ లు, క‌మర్షియ‌ల్ బిల్డింగ్ లు ఉన్నాయ‌ని తెలిపారు. త‌న వ‌ద్ద ఉన్న ఆభ‌ర‌ణాల వ్యాల్యూ 8.2 కోట్ల‌ని చెప్పారు. తాను బ్యాంకుల‌కు రూ.69 కోట్లు లోన్లు క‌ట్టాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. 

వైసీపీ త‌రుఫున రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌నున్న మ‌రో వ్య‌క్తి ఎస్. నిరంజ‌న్ రెడ్డి. ఆయ‌న సినీ నిర్మాత‌, లాయ‌ర్ గా కూడా ప‌ని చేస్తున్నారు. ఆయ‌న తన అఫిడ‌విట్ లో ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. మొత్తం ఆస్తుల వ్యాల్యూ రూ.75.91 కోట్ల‌ని పేర్కొన్నారు. 10.99 కోట్లు బ్యాంక్ లోన్ ఉంద‌ని తెలిపారు. త‌న పేరుపై రూ.82.48 కోట్లు ఆస్తులు ఉన్నాయ‌ని, అలాగే త‌న భార్య వైదేహి రెడ్డి పేరుపై రూ..9.17 కోట్లు ఆస్తులు ఉన్నాయ‌ని ప్ర‌టించారు. కూతురు పేరు మీద రూ.1.13 కోట్ల ఆస్తులు ఉన్నాయ‌ని తెలిపారు. త‌న పేరుపై ఒక కారు ఉంద‌ని నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు. త‌న వైఫ్ పేరు మీద నిరంజ‌న్ అసోసియేట్స్ లో ముప్పై నాలుగు శాతం షేర్ ఉంద‌ని తెలిపారు. అలాగే త‌న‌కు 70 శాతం షేర్ సాగర్ కన్వెన్షన్ బిజినెస్ సెంటర్ లో ఉంద‌ని పేర్కొన్నారు. 

బీసీ నాయ‌కుడు, టీడీపీ త‌రుఫున 2014 ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్. కృష్ణ‌య్య కూడా ఈ సారి వైసీపీ త‌రుఫున రాజ్య‌స‌భకు వెళ్ల‌నున్నారు. ఆయ‌న కూడా త‌న ఆస్తులు, అప్పుల వివ‌రాల‌ను అఫిడ‌వ‌ట్ లో పొందుప‌ర్చారు. ఆయ‌న మొత్త ప్రాప‌ర్టీ వ్యాల్యూను రూ.3.50 కోట్లుగా ప్ర‌క‌టించారు. అలాగే 39.26 ల‌క్ష‌ల అప్పులున్నాయ‌ని తెలిపారు. ఓ కారు త‌న పేరుపై, మ‌రో కారు త‌న వైఫ్ పేరుపై ఉన్నాయ‌ని పేర్కొన్నారు. త‌న భార్య పేరుపై ఉన్న అగ్రిక‌ల్చ‌ర్, నాన్ అగ్రిక‌ల్చ‌ర్ ల్యాండ్, రెసిడెన్షియ‌ల్ హౌస్ ల మొత్తం విలువ 1.95 ల‌క్ష‌లు ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.