ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య హత్య: నలుగురి అరెస్ట్
కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసులో కుండా రవితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
కడప: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసులో కుండా రవితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ఈ నెల 29వ తేదీన ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ హత్యపై వైఎస్ఆర్సీపీపై బాధిత కుటుంబం ఆరోపణలు చేసింది.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు ఆయన బావమరిది బంగారు మునిరెడ్డిపై సుబ్బయ్య తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలు చేసిన కొన్ని రోజులకే సుబ్బయ్య హత్యకు గురికావడం ప్రొద్దుటూరులో రాజకీయంగా కలకలం రేపుతోంది.
తన భర్త హత్యకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు ఆయన బావమరిది మునిరెడ్డి కారణమని మృతుడి భార్య ఆరోపించారు.ఈ మేరకు ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో వారి పేర్లను పేర్కొంది.
also read:టీడీపీ నేత నందం సుబ్బయ్య దారుణ హత్య: ప్రొద్దుటూరులో ఉద్రిక్తత
ఇళ్ల పట్టాలను పంపీణీ చేసే స్థలంలోనే సుబ్బయ్యను హత్యకు గురయ్యాడు. కళ్లలో కారం కొట్టి సుబ్బయ్యను నరికి చంపారు. సుబ్బయ్య మొబైల్ ఫోన్ కన్పించడం లేదు.హత్య జరిగిన స్థలానికి సుబ్బయ్య ఎందుకు వెళ్లాడు... ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారనే విషయమై విచారణ చేయాలని మృతుడి భార్య డిమాండ్ చేస్తోంది.
ఎమ్మెల్యేతో పాటు ఆయన బావ మరిది పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చాలని ఆమె కోరుతున్నారు.