దోపిడిదారులకు మాన్సాస్ ట్రస్ట్లో స్థానం లేదు: ఆశోక్గజపతిరాజు
దోపిడిడారులకు మాన్సాస్ ట్రస్టులో చోటు లేదని ట్రస్టు చైర్మెన్, మాజీ కేంద్ర మంత్రి ఆశోక్గజపతి రాజు స్పష్టం చేశారు
విజయనగరం: దోపిడిడారులకు మాన్సాస్ ట్రస్టులో చోటు లేదని ట్రస్టు చైర్మెన్, మాజీ కేంద్ర మంత్రి ఆశోక్గజపతి రాజు స్పష్టం చేశారు.గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.అధికారులు భయపడితే ప్రయోజనం లేదన్నారు. అధికారులు సహకరిస్తే పారదర్శకతతో ముందుకెళ్తామని ఆయన చెప్పారు.
also read:మాన్సాస్ ట్రస్ట్ వ్యవహరాల్లో జోక్యం చేసుకోలేదు: వెల్లంపల్లి శ్రీనివాసరావు
మాన్సాస్ సిబ్బందికి ఎందుకు జీతాలు ఇవ్వలేదో అర్ధం కావడం లేదన్నారు. కార్యాలయాన్ని విజయనగరం నుండి ఎందుకు తరలిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మాన్సాస్ ట్రస్ట్ లో ఆడిట్ జరగలేదంటే ఆశ్చర్యపోయానన్నారు. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన గుర్తు చేశారు.కోర్టు తీర్పు తరువాత మాన్సాస్ ఛైర్మెన్గా అశోక్ గజపతిరాజు తొలి సంతకం చేశారు. ప్రతి ఏడాది ఆడిట్ జరపటానికి సంస్ధ నుంచి ఫీజు కూడా అధికారికంగా చెల్లించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.రామతీర్థం విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదన్నారు. విగ్రహాల పున:ప్రతిష్ట కోసం తాను విరాళం పంపినా కూడ తిప్పి పంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కోలగట్ల కరోనా నుంచి కోలుకోవడం సంతోషంగా ఉందన్నారు. మాన్సాస్ చైర్మెన్గా తమ ప్రథమ ప్రాధాన్యం విద్యకేనన్నారు. దాని కోసం ప్రభుత్వ సహకారాన్ని కూడా అర్ధిస్తామన్నారు.విశాఖలోని పంచ గ్రామాల సమస్యపై దృష్టి సారిస్తామని అశోక్ గజపతిరాజు చెప్పారు.హిందూ మతంపై వైసీపీ ప్రభుత్వం ఎందుకు దాడులు చేస్తోందని అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. దుండగుల దాడిలో రాముని శిరస్సు ఖండించిన వారిని పట్టుకోకపోగా ఆలయ బాగు కోసం విరాళం ఇచ్చినా తిరస్కరించటం తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిందన్నారు. మహారాజకోటలో చారిత్రక మూలాలు ధ్వంసం చేశారన్నారు. సింహాచలం దేవస్థానం వద్ద ఆలయ ఈవో కూడా తనను కలవడానికి ఇష్ట పడలేదన్నారు. మాన్సాస్ భూముల్లో ఇసుక అక్రమాలు ఎవరి హయాంలో జరిగాయో తేల్చాలని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు.