మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు మృతి
టీడీపీ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ మరణించాడు. అనారోగ్య కారణాలతో గత కొంత కాలంగా ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత, మాజీ మంత్రి మాగంటి వెంకటేశ్వర రావు (బాబు) పెద్ద కుమారుడు రాంజీ మరణించారు అనారోగ్య కారణాలతో ఆయన కొద్ది రోజుల పాటు ఏలూరు ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన వయస్సు 37 ఏళ్లు.
ఆ తర్వాత ఆయనను విజయవాడ ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించింది. దీంతో ఆయన తుది శ్వాస విడిచారు. రాంజీ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. బ్రెయిన్ డెడ్ అయి ఆయన మరణించినట్లు చెబుతున్నారు.
రాంజీ టీడీపీ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించేవారు పార్టీ వ్యవహారాల్లో మాగంటి బాబుకు సహాయసహకారాలు అందిస్తూ వచ్చారు. రాంజీ మృతి పట్ల సినీ నటుడు నారా రోహిత్ విచారం వ్యక్తం చేశారు. రాంజీ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాంజీ మృతి బాధాకరమని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పార్టీ పటిష్టతకు యువకుడిగా ముందుండి కష్టపడిన రాంజీ మృతి విచారకరమని చంద్రబాబు అన్నారు.
ఏలూరు టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు తనయుడు రాంజీ మృతి బాధాకరమని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రాంజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాంజీ మృతి జీర్ణించుకోలేని విషయమని అచ్చెన్నాయుడు అన్నారు.