బాబుకు షాక్: కాంగ్రెస్లో చేరనున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 22వ తేదీన ఆయన కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు
కర్నూల్: మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 22వ తేదీన ఆయన కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీలో చేరాలని ఆయన చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలను పార్టీలోని ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమావేశమయ్యారు. ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. బాబుతో సమావేశం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్న తన అనుచరుడితో నామినేషన్ ను ఉపసంహరింపజేశారు.
అయితే ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. టీడీపీలోని ఓ వర్గం ఆయనను పార్టీలోకి రాకుండా అడ్డుకొంది. దీంతో ఆయన చాలా కాలంగా టీడీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు.
ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి గాలం వేశారు. టీడీపీలో చేరేందుకు చివరివరకు చేసిన ప్రయత్నాలు నెరవేరని కారణంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చివరి అవకాశం గా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోదరుడి తనయుడు సిద్ధార్థరెడ్డి ఇటీవలనే వైసీపీలో చేరారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చొరవ కారణంగానే సిద్ధార్థరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే సిద్ధార్థరెడ్డి వైసీపీలో చేరడం కూడ కర్నూల్ జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది.
మరో వైపు టీడీపీలో చేరడాన్ని ఓ వర్గం అడ్డుకోవడంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకొన్నారని ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.