రాజకీయాల్లోకి పున:ప్రవేశం కోసం బిజ్జం స్కెచ్: నంద్యాల ఎంపీ స్థానానికి పోటీ
పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డి తిరిగి రాజకీయాల్లోకి పున:ప్రవేశం కోసం రంగం సిద్దం చేసుకొంటున్నారు. 1999లో పాణ్యం నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించిన బిజ్జం పార్థసారథి రెడ్డి 2004 నుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
కర్నూల్:పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డి తిరిగి రాజకీయాల్లోకి పున:ప్రవేశం కోసం రంగం సిద్దం చేసుకొంటున్నారు. 1999లో పాణ్యం నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించిన బిజ్జం పార్థసారథి రెడ్డి 2004 నుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంో కాటసాని రాంభూపాల్ రెడ్డి, బిజ్జం పార్థసారథి రెడ్డి వర్గాల మధ్య తరాలుగా ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ నియోజకవర్గంలో ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అప్పట్లో ప్రచారంలో ఉండేది.
1999 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజ్జం పార్థసారథి రెడ్డి పాణ్యం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో మరోసారి టీడీపీ అభ్యర్ధిగా అదే నియోజకవర్గం నుండి పోటీ చేసిన బిజ్జం పార్థసారథిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు.
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే ఆ సమయంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, బిజ్జం పార్థసారథిరెడ్డి వర్గీయుల మధ్య రాజీ కుదిర్చారని అప్పట్లో ప్రచారంలో ఉంది. దీంతో రాజకీయాలకు బిజ్జం పార్థసారథి రెడ్డి దూరమయ్యారనే ప్రచారం కూడ లేకపోలేదు. అంతేకాదు వ్యాపారానికి మాత్రమే ఆయన పరిమితమయ్యారు.
అయితే దీంతో పాణ్యం నియోజకవర్గం నుండి 2009లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడ టీడీపీకి దూరమయ్యారు. మాజీ పోలీసు అధికారి శివానందరెడ్డి పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. బైరెడ్డి కూడ టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, పార్టీలోని ఓ వర్గం మాత్రం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని టీడీపీలోకి రాకుండా అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు కూడ లేకపోలేదు.
ఇదిలా ఉంటే బిజ్జం పార్థసారథి రెడ్డి కూడ తిరిగి రాజకీయాల్లోకి పున:ప్రవేశం చేయాలని భావిస్తున్నారని సమాచారం. నంద్యాల పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని బిజ్జం పార్థసారథిరెడ్డి ప్లాన్ చేసుకొంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. తన స్వంత మండలాలు కొన్ని వేరే అసెంబ్లీ నియోజకవర్గంలోకి మారడంతో బిజ్జం పార్థసారథిరెడ్డి నంద్యాల పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దిగాలని భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
అయితే బిజ్జం పార్థసారథిరెడ్డి మాత్రం నంద్యాల నుండి ఎంపీగానే పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే ఈ విషయమై కొన్ని రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.