ఫోన్  ట్యాపింగ్   చేయాల్సిన అవసరం  తమకు లేదని  మాజీ మంత్రి కొడాలి నాని చెప్పారు.  ఈ అలవాటు చంద్రబాబుకు ఉందన్నారు.   


అమరావతి:ఫోన్ ట్యాపింగ్ గురించి కేంద్రాని కే కాదు ఎఫ్ బీఐకి ఫిర్యాదు చేసుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాజీ మంత్రి కొడాలి నాని సూచించారు.ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. అలాంటి దరిద్రపు అలవాటు చంద్రబాబుకే ఉంటుందని కొడాలి నాని విమర్శించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బుధవారం నాడు తాడేపల్లిలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆనాడే జగన్ ను ఏమీ చేయలేకపోయారన్నారు. ఇప్పుడు ఏం చేయగలరని ఆయన ప్రశ్నించారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవులను జగన్ కేటాయించారన్నారు. మంత్రి పదవులు ఇవ్వలేనని జగన్ చెప్పాక చాలా మంది అర్ధం చేసుకున్నారని కొడాలి నాని చెప్పారు. తన సామాజికవర్గానికి చెందిన పలువురికి జగన్ మంత్రి పదవులు ఇవ్వలేకపోయారని కొడాలి నాని చెప్పారు.

వైసీపీలో ఉంటే మరోసారి గెలిచినా మంత్రి పదవి దక్కదనే అనుమానంతోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకుని ఉంటారన్నారు. . తమకు సమాచారం తెలిస్తే ఇంటలిజెన్స్ అధికారులకు చెబుతామన్నారు. ఇంటలిజెన్స్ అధికారులు తమ వద్ద సమాచారాన్ని తమకు షేర్ చేస్తారని కొడాలి నాని వివరించారు. ఇంటలిజెన్స్ డీజీ ప్రభుత్వంలో భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను, దేవుడిని సీఎం జగన్ నమ్ముకున్నారన్నారు. శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్లు పోతేనే పార్టీకి మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ టికెట్ ఇస్తానంటే నెల్లూరు రూరల్ నుండి పోటీ చేయడానికి వందలమంది క్యూ కడుతారని చెప్పారు.