రూపాయి ఖర్చుపెట్టలేని స్థితిలో జగన్ సర్కార్.. కారణమిదే..!!
ఏపీ ప్రభుత్వంలో ఫైనాన్షియల్ షట్డౌన్ పరిస్ధితి ఏర్పడింది. మరో మూడు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని విచిత్రమైన స్థితికి జగన్ సర్కార్ చేరుకుంది
ఏపీ ప్రభుత్వంలో ఫైనాన్షియల్ షట్డౌన్ పరిస్ధితి ఏర్పడింది. మరో మూడు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని విచిత్రమైన స్థితికి జగన్ సర్కార్ చేరుకుంది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని పరిస్థితి నెలకొంది.
ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఆమోదించకపోవడంతో.. నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం ఎలాంటి ఖర్చు చేయకూడదు. ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునే వెసులుబాటు ఉండదు.
దీనిని ఫైనాన్షియల్ షట్ డౌన్ అంటారు. ఇవాళ్టీ నుంచి బిల్లు ఆమోదం పొందే వరకు ఒక్క రూపాయి కూడా వినియోగించుకునే అవకాశం వుండదు. శనివారం నాటికి సాంకేతిక ఇబ్బందులు తొలగి.. గవర్నర్ సంతకం చేస్తే, నిధులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అంటే ఇవాళ్టీ నుంచి శనివారం వరకు ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేని పరిస్థితి. నిన్నటి వరకు ఆర్డినెన్స్ జారీ చేయడం ద్వారా ప్రభుత్వం ఖర్చు చేసింది. అయితే 14 రోజుల్లోగా మనీ బిల్లును మండలి ఆమోదించకపోతే, గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది.
ఇవాళ్టీతో గడువు ముగుస్తుండటంతో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేకపోయామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. అప్రోప్రియేషన్ బిల్లును టీడీపీ ఉద్ధేశపూర్వకంగా అడ్డుకుందని ఆరోపించారు.
అధికారం రాలేదని ప్రజలపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని.. ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేలా బిల్లును అడ్డుకున్నారని కన్నబాబు విమర్శించారు. దీని వల్ల సకాలంలో వేతనాలు ఇవ్వలేకపోయామని.. ఓటమి జీర్ణించుకోలేకే చంద్రబాబు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
బిల్లు విషయంలో ఎలాంటి దురుద్దేశాలు లేకుంటే చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు. ప్రాణాలు పోసే అంబులెన్స్లను ఏర్పాటు చేసిన చరిత్ర జగన్ది అయితే, ప్రాణాలు పోయాక మృతదేహాల తరలింపుకు వాహానాలు ఏర్పాటు చేసిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి ఎద్దేవా చేశారు.