అర్థరాత్రి అడవిలో చిన్నారులు.. మద్యం మత్తులో భార్యను కొట్టి, చిన్నారుల్ని చీకట్లో వదిలేసిన కన్నతండ్రి...
కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ కన్నతండ్రి దారుణానికి ఒడిగట్టాడు. మూడు, ఐదేళ్ల చిన్నారులిద్దరిని అర్థరాత్రి అడవిలో వదిలేశాడు.
కర్నూలు : కన్నతండ్రే వారి పాలిట కర్కశుడిగా మారాడు. పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచి, చేయబట్టి నడిపించాల్సిన తండ్రి మానవత్వాన్ని మరిచాడు. మూడు, ఐదు సంవత్సరాల చిన్నారుల విషయంలో దారుణంగా వ్యవహరించాడు. వారిద్దరినీ కారు చీకట్లో వదిలేశాడు. మద్యం మత్తులో ఆయన చేసిన పనికి అభం శుభం తెలియని చిన్నారులు తీవ్రంగా భయపడిపోయారు. రాత్రంతా చలికి వణికిపోతూ అల్లాడిపోయారు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో నివాసముంటున్న కృష్ణ, సుజాత దంపతులకు ఐదుగురు సంతానం. వారిలో ఒక కుమార్తె, నలుగురు కుమారులు.
కృష్ణ మద్యానికి బానిసయ్యాడు. దీనికితోడు భార్య మీద అనుమానం. ఆ అనుమానంతోనే భార్యను నిత్యం వేధించేవాడు. సోమవారం రాత్రి ఆమెతో గొడవపడి దారుణంగా కొట్టాడు. మద్యంమత్తులో జోగుతూ భార్య, ఇద్దరు కుమారులు బంటు(3), మహేంద్ర(5)లను ఆటోలో ఎక్కించుకుని ఊరికి దూరంగా తీసుకు వెళ్ళాడు. కొంత దూరం వెళ్లాక భార్యను ఆటో నుంచి దించేసి.. ఆమెపై మరోసారి దాడి చేశాడు. దీంతో ఆమె స్పృహ తప్పింది. ఆమెను అక్కడే వదిలేసి కుమారులు తీసుకుని వెళ్లాడు. వారిద్దరినీ ఐదు కిలోమీటర్ల దూరంలోని ప్యాలకుర్తి లోని దిగువ కాలువ గట్టు దగ్గర వదిలేశాడు. అక్కడినుంచి వెళ్లిపోయాడు.
కర్నూల్ లో అమానుషం... కన్న బిడ్డలను అర్ధరాత్రి అడవిలో వదిలిపెట్టిన తాగుబోతు తండ్రి
చిమ్మచీకట్లో పిల్లలిద్దరూ భయంతో వణికిపోయారు. తెల్లవారుజామున పొలాలకు నీరు పెట్టేందుకు అటుగా వచ్చిన ప్యాలకుర్తి రైతు లక్ష్మీనారాయణ పిల్లల ఏడుపు విన్నాడు. దగ్గరికి వెళ్లి చూసి... వారి గురించి పోలీసులకు సమాచారం అందించాడు. హైవే పోలీసులు వచ్చి.. చిన్నారులను చేరదీశారు. పిల్లలు తమ తల్లి గురించి చెప్పగా.. ఆమెను కూడా పోలీసులు రక్షించారు. మంగళవారం కృష్ణను స్టేషన్కు పిలిపించి భార్యాభర్తలకు కౌన్సిలింగ్ చేసి, చిన్నారులను అప్పగించారు. విషయం తెలిసి బాలల సంరక్షణ నిర్వాహకులు కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. చిన్నారులను చేరదీసేందుకు ముందుకు వచ్చారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.