మామ గంగిరెడ్డి మృతి: పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్
మామ గంగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల చేరుకున్నారు. ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత మరణించిన విషయం తెలిసిందే.
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం మధ్యాహ్నం పులివెందుల చేరుకున్నారు. మామ గంగిరెడ్డి అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. అంతకు ముందు ఆయన కడప చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పులివెందులకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడప రెవెన్యూ జాయింట్ కలెక్టర్ ఎం. గౌతమి, సబ్ కలెక్టర్ పృథ్వితేజ్, డీఐజీ వెంకటరామిరెడ్డి తదితరులు ఆయన కడప విమానాశ్రయంలో జగన్ ను కలిశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామ, ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు.
గంగిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యుడు. పేదల డాక్టరుగా ఆయనకు పేరుంది. గంగిరెడ్డి 2001 - 2005 మధ్య కాలంలో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు
2003లో రైతులకు రబీ వితనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టర్ కార్యాలయం వరకు గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. గంగిరెడ్డిని పరామర్శించడానికి ఇటీవల వైఎస్ జగన్ హైదరాబాదు వచ్చిన విషయం తెలిసిందే.
విజయవాడ, అక్టోబర్ 03: ప్రముఖ వైద్యులు, ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మామ డాక్టర్ ఇసి గంగిరెడ్డి మృతి పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ సంతాపం ప్రకటించారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ శనివారం గంగిరెడ్డి మరణించగా, శ్రీ హరిచందన్ మాట్లాడుతూ డాక్టర్ గంగి రెడ్డి వైయస్ఆర్ కడప జిల్లాలో ప్రఖ్యాత శిశువైద్యుని గానే కాక, ప్రజా వైద్యునిగా ప్రసిద్ది చెందారని ప్రస్తుతించారు.
గంగి రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నానన్నారు. సిఎం శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి, ఆయన భార్య శ్రీమతి వై.ఎస్. భారతి, కుటుంబ సభ్యులకు గౌరవ హరి చందన్ హృదయ పూర్వక సంతాపం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.