పోలీసునంటూ దుర్గ గుడి ఛైర్మన్ సోదరుడు హల్ చల్... ఒకరి కిడ్నాప్
పోలీసులమంటూ బెదిరించి ఓ వ్యక్తిని కొందరు కిడ్నాప్ చేసిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.
విజయవాడ: తాము పోలీసులమంటూ బెదిరించి ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటన బెజవాడలో చోటుచేసుకుంది. ఇలా కిడ్నాప్ కు పాల్పడిన వ్యక్తి నుండి మూడు లక్షలు డిమాండ్ చేసిన నకిలీ పోలీసులు చివరకు అసలు పోలీసులకు చిక్కారు. ఇలా ఐదుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
నకిలీ పోలీసుల పేరిట కిడ్నాప్ కు పాల్పడిన నిందితుల్లో విజయవాడ దుర్గ గుడి ఛైర్మన్ పైలా సోమినాయుడు సోదరుడు వున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓ ఎఆర్ఎస్సై తనయుడు కూడా కిడ్నాప్ గ్యాంగ్ లో వున్నట్లు సమాచారం. దీంతో వారిని ఈ కేసు నుండి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కిడ్నాప్ కు గురయిన బాధితుడిని బెదిరించి కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయడంతో పాటు పోలీస్ ఉన్నతాధికారుల నుండి స్థానిక పోలీసులపై కూడా ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.