ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసు : ఒంగోలు పోలీసుల తీరుపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీరియస్
ఒంగోలు పోలీసుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుకు నిరసనగా తన గన్ మెన్లను సరెండర్ చేస్తున్నట్లు డీజీపీకి లేఖ రాశారు.

ఒంగోలు : ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో పోలీసుల వ్యవహారశైలిపై వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా తన గన్ మెన్ లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్ చేస్తున్నట్లు బాలినేని డీజీపీకి లేఖ రాశారు. ఈ స్కాం కేసులో వైసీపీ నేతలు ఉన్నా వదిలిపెట్ట వద్దని ఇప్పటికే పలుమార్లు బాలినేని చెప్పిన విషయం తెలిసిందే.
అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదు అంటూ బాలినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో ఇప్పటివరకు పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.
ఈసారి ఎన్నికలు అంత ఈజీ కాదు.. వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలు తొందర్లోనే జరగనున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సొంత పార్టీలోనే విభేదాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ సంతనూతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ మేరకు సెప్టెంబర్ 29న ఓ ప్రకటన వెలువడింది. దీంట్లో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భవనం శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.
శ్రీనివాసరెడ్డి బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన వాడు. మొదటినుంచి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అనుచరుడుగా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి భార్య జెడ్పిటిసి సభ్యురాలు. మరోవైపు పర్చూరు నియోజకవర్గ బాధ్యుడు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కి.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి.
ఇంకోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డికి.. భవనం శ్రీనివాసరెడ్డి అత్యంత సన్నిహితుడు. దీంతో కక్షపూరితంగానే ఆమంచి కృష్ణమోహన్.. భవనం శ్రీనివాసరెడ్డిపై వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశాడని.. సస్పెండ్ చేయించినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీంతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడుతున్నారు.
తన అనుచరుడైన భవనం శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి తీవ్రంగా పరిగణించారు. మాజీ మంత్రి అయిన బాలినేని జిల్లా పార్టీలో చోటుచేసుకున్న తాజా పరిణామాలను తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని.. అలా చేయకుండా తన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏమిటి అంటూ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు సస్పెండ్ చేసిన నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకోవాలని బాలినేని సీఎంను కోరినట్లుగా ప్రచారం జరుగుతుంది.