వీడి దొంగ భక్తి చూడండి... దండం పెట్టిన చేతుల్తోనే అమ్మవారి నగలు దండుకుంటున్నాడు..!
సాధారణంగా ఆ దేవుడికి ఆభరణాలు చేయించి తమ మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. కానీ దండం పెట్టిన చేతులతోనే అమ్మవారి నగలు కాజేసాడో ఓ దొంగ భక్తుడు.
ఏలూరు : ఏదయినా తప్పు చేస్తే క్షమించాలని ఆ దేవుడిని వేడుకుంటాం. కానీ ఆ దేవుడితోనే చెలగాటం ఆడుతూ దొంగతనానికి పాల్పడ్డాడో ఘరానా దొంగ. భక్తుడి ముసుగులో ఆలయానికి వచ్చి ఏకంగా అమ్మవారి మంగళసూత్రాన్ని కాజేసి పరారయ్యాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా సత్రంపాడులో చోటుచేసుకుంది. అయితే ఈ దొంగతనం దృశ్యాలు ఆలయంలోని సిసి కెమెరాల్లో రికార్డవడంతో ఈ దొంగ భక్తుడి గుట్టు రట్టయ్యింది.
సత్రంపాడులోని సౌభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తుడిలా వచ్చాడో దొంగ. అమ్మవారికి దండం పెట్టుకుంటూ అదును చూసుకున్నాడు. పూజారిగానీ, ఇతర భక్తులు లేకపోవడంతో తన పని కానిచ్చేసాడు. ఎంచక్కా గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారి మెడలోని పదికాసులు మంగళసూత్రాన్ని కాజేసాడు. ఇలా భక్తుడి ముసుగులో వచ్చి ఏకంగా అమ్మవారి నగలనే దోచుకున్నాడు.
అయితే అమ్మవారి మెడలో మంగళసూత్రం కనిపించకపోవడంతో ఆలయ సిబ్బంది కంగారుపడిపోయారు. వెంటనే ఆలయంలోని సిసి కెమెరాను పరిశీలించగా దొంగ భక్తుడి నిర్వాకం భయటపడింది. వెంటనే ఆలయ సిబ్బంది ఈ చోరీపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిసి ఫుటేజి ఆదారంగా దొంగను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అయితే సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ చోరి సిసి వీడియో బయటకు వచ్చింది. దీంతో అమ్మవారి నగలు కాజేసిన దొంగపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేవుడితో పెట్టుకున్నాడు... ఇక అతడి పని అంతేనని అంటున్నారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని దొంగిలించిన మంగళసూత్రాన్ని ఆలయ సిబ్బందికి తిరిగి ఇచ్చేయాలని సదరు దొంగను సూచిస్తున్నారు.