దేవుడి పటాలు కాలిపోయాయని.. దొంగస్వామి దగ్గరికి వెడితే...మహిళను మోసం చేసి, పైగా...
దేవుడి పటాలు కాలిపోయాయని సలహా కోసం దొంగస్వామిని ఆశ్రయించిందో మహిళ. ఆమెకు మాయమాటలు చెప్పి రూ.13 లక్షలు కాజేశాడు ఆ బాబా.
గుంటూరు : మూఢనమ్మకాలు, దొంగస్వాములతో ఎంతోమంది మోసపోతున్నా.. ఎన్నో మోసాలు వెలుగు చూస్తున్నా జనాల్లో మార్పు రావడం లేదు. మూఢనమ్మకాలతో దొంగస్వాములను నమ్మి లక్షల్లో సమర్పిచుకుని ఆ తరువాత తీరిగ్గా లబోదిబో మంటున్నారు. అలాంటి ఓ ఘటనే గుంటూరులో తాజాగా వెలుగు చూసింది.
ఓ మహిళ ఇంట్లో దేవుడి పటాలు కాలిపోయాయి. ఇంకేముంది.. ఆమె మనసులో అనుమానం మొదలయ్యింది. కాలిపోవడానికి అగరబత్తి తగిలిందో, దీపం వత్తి పెద్దదై మంటలంటుకున్నాయో.. ఇంకే కారణమో తేల్చుకోకుండా.. అరిష్టం అనుకుంది. అది మామూలు విషయం కాదని.. సహజం కాదని నమ్మింది. తమకేదో కీడు జరుగుతుందని మూఢనమ్మకం పెంచుకుంది.
టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న నిరసన.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..
దీనికి ఏదో నివారణ చేయాలంటూ ఆలోచించింది. అందుకోసం ఓ దొంగస్వామిని ఆశ్రయించింది. ఆమె మూఢనమ్మకాన్ని ఆ దొంగస్వామి క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. ఆమె అనుకునేది నిజమేనని.. పరిహారం చేయాలని మాయమాటలు చెప్పాడు. అలా ఆమె దగ్గర రూ.13 లక్షల దాకా వసూలు చేశాడు. ఈ క్రమంలో కొద్ది రోజులు గడిచిపోయాయి. అప్పటికి గానీ తాను మోసపోయిన విషయం ఆమెకు అర్థం కాలేదు.
వెంటనే ఆ దొంగస్వామిని నిలదీసింది.. తన డబ్బులు తనకు వాపస్ ఇవ్వాలని పట్టుబట్టింది. దీంతో దొంగస్వామి ఎదురుతిరిగాడు. తన అనుచరులను పురమాయించాడు. అట్రాసిటీ కేసు పెడతామంటూ వారు సదరు మహిళను బెదిరించడం మొదలుపెట్టారు. తన డబ్బులు రాకపోగా ఈ బెదిరింపులతో విసిగిపోయిన ఆ మహిళ చివరకు గుంటూరు పోలీసులను ఆశ్రయించింది. దీంతో విషయం వెలుగు చూసింది.