మళ్లీ వైసీపీలోకి గుర్నాథరెడ్డి..?
తిరిగి సొంత గూటికే వెళదామని నిశ్చయించుకున్నారట. ఈమేరకు వైసీపీ ముఖ్యనేతలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం.
మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి.. చంద్రబాబుకి షాకివ్వనున్నారా..? అవుననే వార్తలే ఎక్కువగా వినపడుతున్నాయి. గుర్నాథరెడ్డి మొదట వైసీపీకి చెందిన నేత అన్న సంగతి తెలిసిందే. కాగా.. కొంతకాలం క్రితం ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి.. ఆ పార్టీలో ఉంటే లాభం చేకూరుతుందని ఆయన పార్టీ మారారు. అయితే.. ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. అధికార పార్టీలో ఆయనకు ఆశించిన ఫలితం లభించలేదనే వాదనలు వినపడుతున్నాయి.
దీంతో.. తిరిగి సొంత గూటికే వెళదామని నిశ్చయించుకున్నారట. ఈమేరకు వైసీపీ ముఖ్యనేతలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. కాగా.. ఈ విషయం చంద్రబాబు దాకా వెళ్లింది.
దీంతో.. చంద్రబాబు.. తనకుమారుడు, మంత్రి లోకేష్ ద్వారా గుర్నాథరెడ్డితో సంప్రదింపులు జరిపారు. ఇటీవల లోకేష్ తో గుర్నాథరెడ్డి సమావేశమయ్యారు. పార్టీ మారే విషయంపై దాదాపు అరగంటపాటు చర్చించారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ను గుర్నాథరెడ్డి కలిసి చర్చించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయమై గుర్నాథరెడ్డిని మీడియా ప్రశ్నించగా.. తమ పార్టీ నాయకుడు కాబట్టి కలిసి.. పార్టీ విషయాలు మాట్లాడుకున్నామని, చురుగ్గా పనిచేయాలని సూచించారని తెలిపారు. అయితే.. పార్టీ మారే విషయంపై లోకేష్ బుజ్జగింపులు జరిపినట్లు వాదనలు వినపడుతున్నాయి. మరి ఈ బుజ్జగింపులు ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి.