చంద్రబాబు శ్వేతపత్రాలన్నీ అభూత కల్పనే.. రావెల
సిఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రాలు చదివితే ఆశ్చర్యం కలుగుతుందని రావెల అన్నారు. అన్నీ చేశామని, అభివృద్ది జరిగింది అంటూ అభూత కల్పనలను వివరిస్తున్నారని ఆరోపించారు.
ఏపీసీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలన్నీ అభూత కల్పనలని మాజీ మంత్రి, జనసేన పార్టీ నేత రావెల కిశోర్ బాబు ఆరోపించారు. విజయవాడలో ఈ రోజు విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు పై మండిపడ్డారు.
సిఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రాలు చదివితే ఆశ్చర్యం కలుగుతుందని రావెల అన్నారు. అన్నీ చేశామని, అభివృద్ది జరిగింది అంటూ అభూత కల్పనలను వివరిస్తున్నారని ఆరోపించారు.
ఈ శ్వేత పత్రాలలో చేయని పనులు చేసినట్లుగా, చేసిన తప్పులను ఒప్పులుగా చూపించుకుంటున్నారని మండిపడ్డారు.మెడికల్ కు సంబంధించి ,MMR, imr ల రేట్ల విషయంలో అన్నీ అబద్దాలే చెప్పారన్నారు. వైద్య సదుపాయాలు, సౌకర్యాలు కేవలం ధనికులు, పట్టణ ప్రాంతం వాసులకే పరిమితం అయ్యాయని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో ఏ మాత్రం వైద్య సదుపాయాలు అందడం లేదన్నారు.శ్వేత పత్రాల తో ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప.. క్షేత్ర స్థాయిలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వాసుపత్రులలో సిబ్బంది, వైద్యుల కొరత ఉన్నా.. ఇంతవరకు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు.
ఎన్నో కొత్త పధకాలు పెట్టామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని..మెడికల్ డైరెక్టర్ పోస్ట్ లో ఇంతవరకు ఎవరినీ ఎందుకు నియమించలేదన్నారు.పూనం మాలకొండయ్య వేధింపులు భరించలేక ఆ పోస్ట్ లోకి ఎవరూ రావడం లేదని ఆరోపించారు.
మెక్ టెక్ జోన్ లో పది మెడికల్ సంస్థ లు వచ్చినట్లు ప్రకటించినా... అవన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మెక్ టెక్ జోన్ పై ప్రత్యేక శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు.వైద్య పరికరాల కొనుగోళ్లలో కూడా లక్షల రూపాయల అవినీతి జరిగిందని..మూడు వేల రూపాయలు ఖరీదు చేసే పరికరానికి ముప్పై వేలు బిల్లులు పెట్టేవారని ఆరోపించారు.