కొండపల్లిలో అక్రమాలు జరగకుంటే.. దేవినేని పర్యటనపై అభ్యంతరమెందుకు: ప్రత్తిపాటి పుల్లారావు
కొండపల్లిలో నిజాలను వెలికితీసేందుకు వెళ్లిన దేవినేని ఉమను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. దేవినేని అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఆదివారం చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కొండపల్లిలో నిజాలను వెలికితీసేందుకు వెళ్లిన దేవినేని ఉమను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని పుల్లారావు ఆరోపించారు. ఆయన అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అవినీతిని ప్రశ్నిస్తే ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ప్రత్తిపాటి మండిపడ్డారు. కొండపల్లిలో ఎలాంటి అక్రమాలు, అన్యాయాలు జరగలేదని ప్రభుత్వం చెబుతోందని.. అలాంటప్పుడు దేవినేని ఉమ పరిశీలనకు వెళ్తే అభ్యంతరమేంటని మాజీ మంత్రి ప్రశ్నించారు.
Also Read:నా భర్తకు జైలులో ప్రాణహాని: హైకోర్టు సిజేకు దేవినేని ఉమ భార్య అనుపమ లేఖ
సీఎం జగన్ నాయకత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని.. ఒక్కో ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న వనరులను దోచుకుంటూ రూ.200కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు కొల్లగొడుతున్నారని పుల్లారావు ఆరోపించారు. చిలకలూరిపేటలో రోజూ 500 లారీల మట్టి, ఇసుక తరలిపోతోందన్నారు. రోడ్ల అభివృద్ధికి మూడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని.. దీనికి కారణం గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడమేనని ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని పుల్లారావు హితవు పలికారు.