రోజా రెండుసార్లు గెలిచింది, పైగా మంత్రి.. నువ్వేం పొడిచావ్ : పవన్కు పేర్నినాని చురకలు
వైసీపీ సీనియర్ నేత, మంత్రి రోజాపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎవరి దగ్గరైనా చేరి మహిళలకు మర్యాద ఎలా ఇవ్వాలో నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు
మంత్రి రోజాపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు మంత్రిగా పనిచేస్తోందని పేర్ని నాని పేర్కొన్నారు. తోటి కళాకారురాలి గురించి పవన్ నీచంగా మాట్లాడారని.. ఇటువంటి వ్యక్తిని మా వాడని చెప్పుకోవడానికి సిగ్గుగా వుందన్నారు. రోజా సినిమాల్లో నటిస్తే చులకనా అని ఆయన ప్రశ్నించారు. మీతో నటించే ఆడవాళ్ల పట్ల మీ అభిప్రాయం అదేనా అని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో ఆడవాళ్లు కూడా నటించారు కదా..?వాళ్లూ అంతేనా అని ఆయన చురకలంటించారు. ఎవరి దగ్గరైనా చేరి మహిళలకు మర్యాద ఎలా ఇవ్వాలో నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. జనాన్ని తాను నమ్మట్లేదని, జనం మాత్రం తనను నమ్మాలని పవన్ అంటున్నారని పేర్ని నాని దుయ్యబట్టారు.
సీఎం,మంత్రులు, వైసీపీ నేతల్ని తిట్టడమే తప్ప పవన్ కొత్తగా చెప్పిందేమీ లేదన్నారు. నమ్మి సభకు వచ్చిన వాళ్లను పట్టుకుని.. మిమ్మల్ని తాను నమ్మనని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ప్రసంగం మొత్తం ఆత్మస్తుతి, పరనిందేనని పేర్నినాని దుయ్యబట్టారు. పవన్ది దిగజారుడు వ్యక్తిత్వమని.. మీరు తనకు నమ్మకం ఇవ్వగలరా అని జనాన్నే ప్రశ్నిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణే మూడు ముక్కల రాజకీయ నాయకుడని పేర్ని నాని సెటైర్లు వేశారు. బీజేపీతో దోస్తీ చేస్తూ.. చంద్రబాబుకు కన్ను కొట్టడం రాజకీయ వ్యభిచారం కాదా అని ఆయన ప్రశ్నించారు.
Also Read: ఒంటరిగా జగన్ను ఎదుర్కొంటే వీర మరణమే.. నిజం ఒప్పుకున్నాడు : పవన్కు పేర్ని నాని కౌంటర్
2014 నుంచి 2019 దాకా ఏం చేశావని పేర్ని నాని నిలదీశారు. శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ ఎందుకు కట్టించలేదని ఆయన ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్ ఫిషింగ్ హార్బర్ కట్టిస్తున్నారని పేర్ని నాని తెలిపారు. సభా వేదికపై ఒక కమ్మ, ఇద్దరు కాపులను కూర్చోబెట్టడమే మీ సంస్కారమా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. మీతో పాటు వేదిక మీద కూర్చోవడానికి ఇతర కులాల వాళ్లు అర్హులు కాదా అని ఆయన నిలదీశారు. మిమ్మల్ని తాను నమ్మలేనని పవన్ నిజం చెప్పారని పేర్ని నాని సెటైర్లు వేశారు. మళ్లీ ఒంటరిగా జగన్ను ఎదుర్కొని.. వీర మరణం పొందలేనని అన్నాడని ఆయన చురకలంటించారు.
చంద్రబాబు చంకనెక్కబోతున్నానని పవన్ చెబుతున్నాడని.. ఇవాళ్టీతో పవన్ ముసుగు తొలగిపోయిందని ఆయన పేర్కొన్నారు. తన చేతికి దగ్గరగా వస్తే ఏం చేస్తానో చెబుతానని పేర్ని నాని హెచ్చరించారు. 2009లో పంచె ఊడదీస్తానని, 2014 దాకా పత్తా లేడని ఆయన చురకలంటించారు. రాజశేఖర్ రెడ్డి పంచెలోని దారపు పోగును కూడా పవన్ టచ్ చేయలేడని పేర్ని నాని అన్నారు. రాజకీయాల్లో పవన్కు వచ్చిన దిక్కుమాలిన ఖర్మ ఇంకెవరికైనా వచ్చిందా అని నాని ప్రశ్నించారు. చంద్రబాబును తిట్టి ఆ ఇంటికే వెళ్లి టీలు తాగుతున్నావని.. పవన్ ఎవరితోనైనా పోరాటం చేశారా అని పేర్నినాని ప్రశ్నించారు.