ఎస్సీ, ఎస్టీ చట్టం లేకుండా చేయాలని వైసీపీ కుట్రలు...ఇదే ఉదాహరణ: మాజీ మంత్రి నక్కా ఆందోళన
అనేక ఉద్యమాల పలితంగా దళితుల రక్షణ కోసం, సమాజంలో అంటరానితనాన్ని నిరోదించేందుకు పార్లమెంట్ ఎస్సీ, ఎస్టీ చట్టం చేసిందని... అలాంటి చట్టాలను వైసిపి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ దళితులకు రక్షణగా ఉన్న ఆ చట్టాన్ని లేకుండా చేయాలని కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల అవినీతి, అరాచకాలపై ప్రశ్నించిన వారిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించి ప్రభుత్వం చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ దేవినేనినిపై ఉమాపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడమేనని ఆనంద్ బాబు అన్నారు.
''అనేక ఉద్యమాల పలితంగా దళితుల రక్షణ కోసం, సమాజంలో అంటరానితనాన్ని నిరోదించేందుకు పార్లమెంట్ ఎస్సీ, ఎస్టీ చట్టం చేసింది. 2018లో మహారాష్ట్ర లో ఓ కేసులో విచారణ సందర్భంగా ఈ చట్టంలో లొసుగున్నాయని, చట్టం దుర్వినియోగం అవుతోందని చట్టంలో మార్పులు చేయాలని సుప్రీం తీర్చిస్తే దాన్ని సమర్ధిస్తూ కేంద్ర అటార్నీ జనరల్ అపఢవిట్ పైల్ చేశారు. దీనికి వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని యధాతదంగా ఉంచాలని దేశవ్యాప్తంగా దళితులు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాయి. ఉత్తరభారత దేశంలో జరిగిన అల్లర్లలో 13 మంది చనిపోయారు'' అని గుర్తుచేశారు.
''ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని యధాతదంగా ఉంచాలని మేం పోరాటం చేశాం, అసెంబ్లీలో చర్చించాం. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ దళిత ఎమ్మెల్యేలు, నాయకులంతా రాష్ట్రపతిని కలిసి చట్టాన్ని యదాతధంగా ఉంచాలని ఇంకా పటిష్టంగా అమలు చేయాలని కోరాం. సుప్రీం కోర్టులో ధళిత సంఘాలు అపిడవిట్ వేస్తే ... రాష్ట్ర ప్రభుత్వం తరపున సోషల్ డిపార్ట్ మెంట్ నుంచి ఇంప్లీడ్ పిటిషన్ వేశాం. ఇన్ని ఉద్యమాల తర్వాత చట్టాన్ని యదాతదంగా ఉంచాలని పార్లమెంట్ తీర్మానం చేసింది. కానీ నాడు ఇంత జరిగినా అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ రెడ్డి దీనిపై కనీసం స్పందించలేదు, తన పత్రికలో ఆ వార్తలు కూడా రాయలేదు. ధలితులను వైసీపీ మొదటి నుంచి ఓట్ బ్యాంక్ గానే చూస్తోంది తప్ప వారి హక్కులు, ప్రయోజనాలు కాపాడటంలో ఏనాడు శ్రద్ద చూపలేదు'' అని మాజీ మంత్రి తెలిపారు.
read more దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్... రాజమండ్రికి తరలింపు
''దళితులకు శిరోముండనం చేసిన వ్యక్తికి జగన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ నేతల ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు దళిత యువకుడు వరప్రసాద్ కి శిరోముండనం చేశారు. దీనిలో ముద్దాయి కమల క్రిష్టమూర్తిపై చర్యలు లేవు. విశాఖలో మరో యువకుడికి శిరోముండం చేశారు. డాక్టర్ సుధాకర్ ని మానసికంగా హింసించి చంపారు. మద్యం రేట్లపై ప్రశ్నించిన చిత్తూరు జిల్లా యువకుడు అనుమాస్పదంగా చనిపోయాడు. డా. అనితా రాణిని అవమానించి వేధింపులకు గురిచేశారు. జడ్జి రామకృష్ణపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. మహాసేన రాజేష్ పై కేసులు పెట్టారు'' అని ఆందోళన వ్యక్తం చేశారు.
''ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దళితులపైనే ప్రయోగించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. రాజధాని దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి 20 రోజులు జైళ్లో వేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో అత్యాచారానికి గురైన దళిత మహిళ కుటుంబానికి న్యాయం చేయమని అడిగేందుకు వెళ్లిన దళిత నేతలు వంగలపూడి అనిత, ఎం.ఎస్. రాజుపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి చట్టాన్ని దుర్వినియోగం చేశారు. మరో వైపు వైసీపీ అవినీతి, అక్రమాలను ప్రశ్నించినవారిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయిస్తూ ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. దేవినేని ఉమాపై, బీసీ జనార్ధన్ రెడ్డి పై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టింది. ఈ విధంగా చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్లో ఈ చట్టం పట్ల చులకనభావం ఏర్పడే చేసి ఈ చట్టాన్ని లేకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏపీలో ఎస్టీ, ఎస్టీ చట్టం దుర్వినియోగంపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే మళ్లీ దీనిపై చర్చ జరిగే అవకాశం ముంది. ఈ విధంగా కుట్ర పన్ని చట్టాన్ని లేకుండా చేయాలని జగన్ రెడ్డి ప్రభుత్వం చూస్తోంది'' అని ఆరోపించారు.
''ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. వైసీపీ తప్పుడు విధానాలను ప్రజల్లో ఎండగడతాం. ప్రకాశం జిల్లా కొండపిలో దళిత ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిని ప్రోటో కాల్ ప్రకారం రైతు దినోత్సవం సభకు హాజరు కాకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటే దీనిపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయమని అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ చెప్పారు. నేడు ఆయనే దేవినేని ఉమాపై వైసీపీ నేతలు పెట్టిన తప్పుడు కేసును ఎలా సమర్థిస్తారు?'' అని ప్రశ్నించారు.
''వైసీపీ పాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయం, చట్టం దుర్వినయోగం అవుతున్న అంశంపై దళిత సంఘాలు ఎందుకు మాట్లడటం లేదు? జగన్ రెడ్డికి భయపడుతున్నారా? ఎంతకాలం భయపడతారు? కొండపల్లి రిజర్వ్ పారెస్ట్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ దేవినేని ఉమా ఏడాది నుంచి మాట్లాడుతున్నారు. దాన్ని పరిశీలించేందుకు వెళ్లి వస్తున్న ఆయనపై వైసీపీ నేతలు దాడి చేసి తిరిగి ఆయనపైనే తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం సిగ్గుచేటు. వైసీపీ ప్రభుత్వం ఇకనైనా దళిత వ్యతిరేక మానుకోవాలి, లేకపోతే దళితుల చేతిలో భారీ మూల్యం చెల్లించక తప్పదు'' అని ఆనందబాబు హెచ్చరించారు.