సైకిలెక్కనున్ను మాజీమంత్రి కొణతాల : ఈనెల 28న చంద్రబాబుతో భేటీ
ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబుతో కొణతాల రామకృష్ణ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఆయన అనకాపల్లి పార్లమెంట్ సీటు అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.
విశాఖపట్నం: మాజీమంత్రి కొణతాల రామకృష్ణ సైకిలెక్కేందుకు రంగం సిద్ధం చేశారు. ఈనెల 28న తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన పునర్విభజన చట్టంలోని ఉత్తరాంధ్రకు రావాల్సిన హామీల సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ గా ఆయన గత కొంతకాలంగా విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా అంశాలపై ఉత్తరాంధ్రతోపాటు ఢిల్లీ స్థాయి వరకు పోరాటం చేశారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన సైకిలెక్కాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబుతో కొణతాల రామకృష్ణ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఆయన అనకాపల్లి పార్లమెంట్ సీటు అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.
మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలను మేని ఫెస్టోలో పొందుపరచాలంటూ ఆయన చంద్రబాబు నాయుడును కలిస్తారని ప్రచారం జరుగుతుంది.
చంద్రబాబు నాయుడుతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే అన్ని ఇతర రాజకీయ పార్టీలను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి సైతం తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఇటీవలే తాను తెలుగుదేశం పార్టీలో చేరతానని లేదంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. సబ్బం హరి కూడా అనకాపల్లి పార్లమెంట్ సీటు లేదా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.