విజయసాయిరెడ్డితో కాదు... అరబిందోకి చంద్రబాబుతోనే సంబంధం : కొడాలి నాని వ్యాఖ్యలు
అరబిందో ఫార్మాకి చంద్రబాబుకూ సంబంధం వుందన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. 2004 నుంచి 2019 దాకా అరబిందో నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్ వసూలు చేశారని కొడాలి నాని ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి సోదరుడేనని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో కౌంటరిచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. అరబిందో సంస్థకు చంద్రబాబుకూ సంబంధం వుందని .. ఈ విసయంపై దమ్ముంటే చంద్రబాబు ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు. 2004 నుంచి 2019 దాకా అరబిందో నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్ వసూలు చేశారని కొడాలి నాని ఆరోపించారు.
2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలని ఆయన జోస్యం చెప్పారు. పులివెందులలో కనీసం ఒక్క పంచాయతీనైనా గెలవగలరా అని చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. నారావారాపల్లెలోని గెలవలేని చంద్రబాబు కుప్పంలో ఎలా గెలుస్తారని కొడాలి నాని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో జగన్ కొట్టిన దెబ్బకు చంద్రబాబుతో పాటు లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు రాజకీయ అనాథలు అయ్యారని.. జనసేనను పవన్... చంద్రబాబుకు అంకితం చేశారని కొడాలి నాని ఆరోపించారు. వచ్చే ఎన్నికల తర్వాత పవన్ తన పార్టీ జెండా పీక్కొని వెళ్లిపోతారని ఆయన జోస్యం చెప్పారు.
ఇకపోతే.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకం రేపుతోంది. ఈ వ్యవహారంపై టీడీపీ నేత పంచుమర్తి అనూరాధ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. శరత్ చంద్రారెడ్డి ఎవరో కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి అన్న అని తెలిపారు. మరి ఈడీ అరెస్ట్ ఘటనపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని.. మద్య నియంత్రణ, నిషేధంపై గొప్పలు చెప్పే జగన్మోహన్ రెడ్డి ఈ అరెస్ట్పై ప్రజలకు సమాధానం చెప్పాలని అనూరాధ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇసుక, మైన్, వైన్, బియ్యం, అంబులెన్స్ మాఫియాలు నడిపిన జగన్... ఇప్పుడు వైద్యం, ప్రజారోగ్యం గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు.
కోవిడ్ సమయంలో రోగులకు భోజనం సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు జగన్ ప్రభుత్వం ఇంత వరకు బిల్లులు చెల్లించలని అనూరాధ ఆరోపించారు. కోవిడ్ మరణాలపై తప్పుడు లెక్కలు చెప్పి, కోట్లాది రూపాయలను జగన్ స్వాహా చేశారని ఆమె వ్యాఖ్యానించారు. కుయ్ కుయ్ మంటూ అంబులెన్స్లు వస్తాయన్న జగన్... మరి ఇప్పుడు అంబులెన్స్లు లేక బిడ్డల శవాలను భుజాలపై వేసుకెళ్తున్న ఘటనలు జగన్కి కనిపించడం లేదా అని అనూరాధ ప్రశ్నించారు. జగన్ తీరు కారణంగా ప్రస్తుతం రోగులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీసం పారా సిటమాల్ టాబ్లెట్ కూడా దొరకడం లేదని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం జగన్ అరాచక పాలనకు నిదర్శనమని ...మహనీయుల గొప్పతనం ఆయనకు తెలియదన్నారు.