విజయసాయిరెడ్డితో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ .. వైసీపీలో కలకలం
వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో పరిణామాలు, ఇతర అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లుగా తెలుస్తోంది.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్లోని బాలినేని నివాసంలో ఈ సమావేశం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో పరిణామాలు, ఇతర అంశాలపై విజయసాయిరెడ్డికి బాలినేని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్కు బంధువనే సంగతి తెలిసిందే. 2019లో వైసీపీ అధికారంలో వచ్చాక జగన్ తన మంత్రివర్గంలోకి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తీసుకున్నారు. అయితే ఆ తర్వాత మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో.. బాలినేనిని మంత్రి పదవి నుంచి తొలగించారు. అయితే బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. స్వయంగా జగన్ రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించారు.
Also Read: జగన్తో ముగిసిన బాలినేని భేటీ.. నన్ను ఇబ్బంది పెట్టిందెవరో చెప్పా , పార్టీ మారను : శ్రీనివాస్ రెడ్డి
ఇక, ఇటీవల సీఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన నేపథ్యంలో మార్కాపురంలో హెలిప్యాడ్ వద్దకు వెళ్లడానికి వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహనం పక్కన పెట్టి నడిచి రావాలని సూచించారు. దీంతో పోలీసుల తీరుపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కార్యక్రమం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. అయితే బాలినేని సర్దిచెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఎస్పీలు ప్రయత్నించారు. అయితే బాలినేని అక్కడి నుంచి వెనుదిరిగేందుకే నిర్ణయించుకున్నారు.
కార్యక్రమంలో పాల్గొనకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సీఎంవో నుంచి బాలినేనికి ఫోన్ కాల్ వెళ్లడంతో.. ఆయన తిరిగివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన అలకబూనడంతో స్వయంగా సీఎం వైఎస్ జగన్ తాడేపల్లికి పిలిపించి మాట్లాడారు. అయినప్పటికీ శ్రీనివాస్ రెడ్డి మునుపటిలా చురుగ్గా వుండటం లేదని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డితో బాలినేని భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.