కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని తాను ఖండిస్తున్నట్లు చెప్పారు మాజీ ఎంపీ , కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్. ఆయన ఒక జిల్లాకు పరిమితమైన వ్యక్తి కాదని స్పష్టం చేశారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడం వెనుక స్వార్ధం వుందని చింతా మోహన్ ఆరోపించారు.
కోనసీమ జిల్లాకు (konaseema district) అంబేద్కర్ (dr br ambedkar) పెట్టడాన్ని నిరసిస్తూ గత మంగళవారం అమలాపురం నిర్వహించిన (amalapuram violence) నిరసన ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (congress) సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ (chinta mohan) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ను ఏపీ ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారి ప్రవర్తిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. అంబేద్కర్ ఒక మహోన్నతమైన వ్యక్తి అని, ప్రపంచ మేధావి అని, ఆయన ఒక జిల్లాకు పరిమితమైన వ్యక్తి కాదని చింతా మోహన్ స్పష్టం చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. ఆ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రేనని చింతా మోహన్ ఆరోపించారు.
పేదలు ఉన్న కాలనీలకు అంబేద్కర్ పేరు పెడితే అందులో ప్రేమ ఉంటుందని... జిల్లాకు ఆయన పేరు పెడితే దాని వెనుక రాజకీయ స్వార్థం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడం వెనుక కూడా స్వార్థమే ఉందని చింతా మోహన్ ఆరోపించారు. సామాజిక న్యాయం పేరుతో అన్యాయాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల స్కాలర్షిప్లు పూర్తిగా తీసేయడం సామాజిక అన్యాయమని చింతా మోహన్ దుయ్యబట్టారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే దానికి నీ దీవెన పేరు ఏమిటని సీఎం జగన్ (ys jagan) పై మండిపడ్డారు. నీవు చదివింది ఏంది? నీవు దీవించేది ఏంది? దీవించేందుకు నీకున్న అర్హత ఏంటని చింతా మోహన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇకపోతే.. అమలాపురం ఘటన పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందన్నారు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు. ఘటనపై ముందస్తుగానే వాట్సాప్లో చర్చించుకున్నారని ఆయన పేర్కొన్నారు. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఏమేం చేయాలో చర్చించుకున్నారని డీఐజీ వెల్లడించారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లను కూడా అరెస్ట్ చేస్తున్నామని పాలరాజు చెప్పారు. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేశామని.. సాయంత్రానికి మరిన్ని అరెస్ట్లు వుంటాయని డీఐజీ వెల్లడించారు.
అమలాపురం అల్లర్లకు రౌడీ షీటర్లే కారణమని ఆయన పేర్కొన్నారు. అల్లర్లలో పాలుపంచుకున్న మరికొందరిని గుర్తించామని, శుక్రవారం మరికొందరిని అరెస్ట్ చేయనున్నట్లు ప్రకటించారు. అనుమానితుల అరెస్టులు పూర్తయ్యే దాకా జిల్లాలో ఇంటర్నెట్ సేవల నిలుపుదలను కొనసాగిస్తామని డీఐజీ వెల్లడించారు. అరెస్టులు ముగిశాక దశలవారీగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తామని పాలరాజు స్పష్టం చేశారు.
