అంతర్వేది రథానికి మంటలు... మా ప్రభుత్వంపై కుట్రలో భాగమే: మంత్రి వెల్లంపల్లి
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధమైన ప్రాంతాన్ని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు పరిశీలించారు.
అంతర్వేది రథం దగ్దమైనట్లు తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించి విచారణకు డీజీపీని ఆదేశించారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పూర్తి విచారణ జరిపించాలని... రథం కాలిపోవడానికి కారకులు ఎవరయినా కఠిన చర్యలు తీసుకోమని డిజిపికి సూచించారని అన్నారు. రథం కాలిపోవడం దురదృష్టకర సంఘటన అని స్పందిస్తూనే నూతన రథాన్ని తయారు చేసి ఫిబ్రవరిలో ఏదైతే రథోత్సవం ఉంటుందో ఆనాటికి రథాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని వెల్లంపల్లి వెల్లడించారు.
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధమైన ప్రాంతాన్ని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు పరిశీలించారు.
అనంతరం దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతూ.... విశ్వహిందూపరిషత్ జనరల్ సెక్రటరీ రవికుమార్ తో తాము కూర్చొని ఈ ఘటన గురించే మాట్లాడడం జరిగిందన్నారు. వారికున్న అనుమానాలను మాకు తెలియపరచమని చెప్పడం జరిగిందన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ, డీఐజీ, ఫొరెన్సిక్ డైరెక్టర్ ఆధ్వర్యంలో లోతైన దర్యాప్తు చేస్తున్నామని... ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడినట్లైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి హెచ్చరించారు.
read more అంతర్వేది ఘటన యాధృచ్ఛికం కాదు...ఉగ్రవాద కోణంలో విచారణ: పవన్ కల్యాణ్ డిమాండ్
''కొంతమంది సోషల్ మీడియాలో పనిగట్టుకుని అవాస్తవాలతో ప్రభత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి రిపోర్ట్ ఇంకా రావలసివుంది. ముఖ్యమంత్రి జగన్ ముగ్గురు మంత్రుల్ని ఘటనా ప్రదేశానికి వెళ్లి పరిశీలించి ఒక రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించారు. తప్పకుండా ముఖ్యమంత్రి ఇక్కడ పరిస్థితుల్ని తెలియజేస్తాము. అదేవిధంగా ఇటువంటి ఘటనలు మళ్లీ ఎక్కడా పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటాము'' అని తెలిపారు.
''దేవాలయాల్లో రథాలు బహిరంగ ప్రదేశాలలోనే ఉంటాయి. అయితే ఇటువంటి తప్పిదాలు, దుర్మార్గాలు జరుగుతాయనే ఆలోచన లేదు. ఈ సంఘటనను దృష్గిలో వుంచుకుని ఇకపై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఈ ఘటన జరిగిన వెంటనే ఆలయ ఈవోను బదిలీ చేశాం, ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే నివేదిక వచ్చిన తరువాత ఎవరైనా అధికారులు అలసత్వం వహిస్తే వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది'' అని మంత్రి తెలిపారు.
''గత ప్రభుత్వ హయాంలో హిందువులపై ప్రభుత్వమే దాడి చేసేది. కానీ ఈరోజు మా ప్రభుత్వం మీద కుట్ర జరుగుతోంది, ఆ కుట్రను పూర్తిగా ఛేదిస్తాం. ఏదైతే హైదరాబాద్ లో కుర్చొని జూమ్ లో మాట్లాడే నాయకులు ఉన్నారో వారికే ఇలా కాల్చడాలు బాగా అలవాటు. తుని ఘటనలో రైలు కాల్చడం గానీ, రాజధాని ప్రాంతాల్లో భూములు ఇవ్వలేదని అరటితోటలు కాల్చడంగానీ.. ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయో అందరికీ తెలుసు'' అని ఆరోపించారు.
''ఇటువంటివి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిపార్ట్ మెంట్ తరపున అన్ని చర్యలు తీసుకుంటాము'' అని మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు.