పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియకు ఉద్యోగులు పెద్ద షాకే ఇచ్చారు.

పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియకు ఉద్యోగులు పెద్ద షాకే ఇచ్చారు. పడవ ప్రమాదం కారణంతో సస్పెండ్ చేసిన ఉద్యోగులపై సస్పెన్షన్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ మంగళవారం ఉదయం పర్యాటక శాఖ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కృష్ణానదిలో ఇటీవలే అనుమతిలేని బోటు ఒకటి ప్రమాదానికి గురైన సంగతి అందరకీ తెలిసిందే. ఆ ప్రమాదంలో 23 మంది మరణించటం అప్పట్లో సంచలనంగా మారింది.

అయితే, పడవ ప్రమాదానికి కారణం నువ్వంటే నువ్వంటూ పర్యాటక శాఖ, ఇరిగేషన్ శాఖలు ఒకదానిపై మరొకటి బాధ్యతలను తోసేసుకున్నాయి. సరే, చివరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదనుకోండి అది వేరే సంగతి. అంత పెద్ద ప్రమాదం జరిగితే అనుమతి లేని బోటు ఎక్కిన ప్రయాణీకులదే అసలు తప్పంటూ మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటిచటంపై పలువురు మండిపడ్డారు. అయినా సరే, ఇంత వరకూ బాధ్యులంటూ ప్రభుత్వం ఎవరినీ తప్పు పట్టలేదు.

ఒక విచారణ కిమటీని వేసింది. కమిటి సిఫార్సులంటూ ఓ నలుగురిని విధుల నుండి సస్పెండ్ చేయటం, బోటుకు సంబంధించిన 7మందిని అరెస్టు చేయటం తప్ప ఇంకేమీ జరగలేదు. ఇదిలావుండగానే ఉద్యోగులంతా ప్రభుత్వ తీరుతో మండిపోతున్నారు. బోటు ప్రమాదం వెనుక ఉన్న పెద్ద వాళ్ళని వదిలేసి ఉద్యోగులను సస్పెండ్ చేయటమేంటని ధ్వజమెత్తారు. శాఖలో బాధ్యతలేని అధికారాలను చెలాయిస్తున్న కన్సెల్టెంట్లను వెంటనే తొలగించాలని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ను మాతృ సంస్ధకు పంపటంతో పాటు అనేక డిమాండ్లతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యోగుల సస్పెన్షన్ వెంటనే ఎత్తేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించటంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.