ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధులు నిర్వరిస్తూ ఓ ఉద్యోగి హఠాన్మరణం చెందాడు. అస్వస్థతగా ఉందని చెప్పినా.. ఉన్నతాధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది.
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఓ ఉద్యోగి ప్రాణాలు తీశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు నియమితుడైన ఉద్యోగి ఆదివారం నాడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరులో చనిపోయాడు. సయ్యద్ ఖాజా మొహియుద్దీన్(55) శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. కావలి కోవూరు విఆర్ఓ కార్యాలయంలో పనిచేసే అతడిని ఎమ్మెల్సీ ఎన్నికల విధుల కొరకు నియమించారు. ఈ క్రమంలోనే ఆయన ఆదివారం నెల్లూరు నగరంలోని డీకే మహిళా కాలేజీలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రానికి వచ్చారు. కాసేపటికి ఆయన అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది 108 వాహనాన్ని పిలిపించి.. దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు అతడిని… ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఖాజా మొహియుద్దీన్ మృతి చెందాడు. నెల్లూరు బాలాజీ నగర్ లోని మల్లెల సంజీవయ్య ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రానికి ఓపివోగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు .. రేపే పోలింగ్, సర్వం సిద్ధం చేసిన ఈసీ
ఖాజా మొహియుద్దీన్ మృతి చెందడంతో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఖాజా మొహియుద్దీన్ ఉదయం విధులకు హాజరైన తర్వాత తనకు ఆరోగ్యం బాగాలేదని.. చాతిలో నొప్పిగా ఉందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. అయినా వారు సకాలంలో స్పందించలేదు. ఈ కారణంతో ఆయన ఆస్వస్థత ఎక్కువై కుప్పకూలిపోయాడని తోటి ఉద్యోగులు చెబుతున్నారు.
ఇదిలా, ఉండగా తెలుగు రాష్ట్రాల్లో టీచర్, గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈరోజు జరగనున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కమిషన్ ఎన్నికల కమిషన్ అంతా సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్, నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ జరగనుంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగునున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ టీచర్ ఎమ్మెల్సీ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.
