ఏలూరు మాయరోగం ఘటనపై టీడీపీ రాజకీయ విభాగం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై సోషల్ మీడియాలో నిందలు వేసింది. దానిపై రవీంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

కడప: పశ్సిమ గోదావరి జిల్లా ఏలూరులో మాయరోగం ఘటనకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాజకీయ విభాగం ట్విస్ట్ ఇచ్చింది. కల్తీ క్లోరిన్ కలపడం వల్లనే ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురయ్యారని, నీటి శుద్ధికి అవసరమైన రసాయనాలను వైసీపీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి సరఫరా చేశారని టీడీపీ రాజకీయ విభాగం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. దీనిపై రవీంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టీడీపీ నాయకులు ఇంగిత జ్ఞానం లేకుండా ఆరోపణలు చేయడం సిగ్గు చేటు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో క్లోరిన్ సరఫరా, ఇతర కాంట్రాక్టులతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు ఏలూరు ఘటనలకు నాసిరకం క్లోరిన్ సరఫరా కారణమని టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం దారుణమని ఆయన అన్నారు. 

దానిపై ఇప్పటికే తాను నిఘా విభాగం వారికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ, సైబర్ క్రేమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మేనమామ కావడం వల్లనే తనను లక్ష్యంగా ఎంచుకున్నారని ఆయన అన్నారు. ఇలా అయినా జగన్మోహన్ రెడ్డికి చెడ్డపేరు తేవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 

విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప ఇలాంటి నీచమైన రాజకీయాలు ఎప్పుడు కూడా చేయలేదని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. దోషులపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని కూడా ఆయన చెప్పారు.