పవన్ తో పోటీకి సై అంటున్న టీడీపీ ఎమ్మెల్యే
తానే గెలుస్తానంటూ ధీమా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేసేందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు అలియాస్ బుజ్జి సై అంటున్నారు. తన నియోజకవర్గంలో పవన్ పోటీ చేసినా.. తానే నెగ్గి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘జనసేనాని పవన్ ఏలూరు నుంచి పోటీ చేసినా ఫర్వాలేదు. ఖచ్ఛితంగా నేనే గెలుస్తా. టీడీపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పవన్ తన విలువ కోల్పోతున్నారు’ అని బుజ్జి కామెంట్లు చేశారు.
ఇదిలా ఉండగా మంగళవారం జరిగిన దిగ్గజ నటుడు స్వర్గీయ ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఓ కలయిక చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే బడేటి బుజ్జి(ఎస్వీఆర్కు బుజ్జి బంధువు) ఆధ్వర్యంలో ఎస్పీ రంగారావు శత జయంతి వేడుకలు జరగ్గా.. ఆ కార్యక్రమానికి బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ హాజయ్యారు.
సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి ఎస్వీఆర్ విగ్రహావిష్కరణలో కామినేని పాల్గొన్నారు. దీంతో టీడీపీ, బీజేపీ మళ్లీ కుమ్మకయ్యారంటూ పలువురు విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై తీవ్ర దుమారం చెలరేగింది. అయితే ఎస్వీఆర్ కుమారుడు కామినేనికి క్లాస్మేట్ కావటం, పైగా తాను ప్రత్యేకంగా ఆహ్వానించటంతోనే ఈ కార్యక్రమానికి కామినేని హాజరైనట్లు ఎమ్మెల్యే బుజ్జి చెబుతున్నారు.