రేపు దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక: టీడీపీకి అభ్యర్థి కరువు.. విజయం తమదేనన్న ఆర్కే.. ఆసక్తిరేపుతున్న రాజకీయం..
గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రేపు జరగనుంది. గత కొంతకాలంగా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఎన్నికల్లో దుగ్గిరాల మండలంలోని మొత్తం 18 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 9, వైసీపీ 8, జనసేన ఒక్క స్థానంలో గెలుపొందాయి.
గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రేపు జరగనుంది. గత కొంతకాలంగా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఎన్నికల్లో దుగ్గిరాల మండలంలోని మొత్తం 18 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 9, వైసీపీ 8, జనసేన ఒక్క స్థానంలో గెలుపొందాయి. అయితే జనసేన అభ్యర్థి టీడీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో టీడీపీ మద్దతు 10కి చేరింది. రిజర్వేషన్ ప్రకారం దుగ్గిరాల ఎంపీపీ సీటు బీసీ మహిళా అభ్యర్థికి కేటాయించారు.
దీంతో టీడీపీ చిలువూరు నుంచి గెలుపొందిన జబీన్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే జబీన్కు కులధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. దీంతో టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఎన్నికపై స్టే విధించింది. నిబంధనల ప్రకారం జబీనకు కులధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే తహసీల్దార్, ఆర్టీవో కార్యాలయాల్లో తనకు న్యాయం జరగలేదని జబీన అప్పటి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్కు అప్పీలు చేశారు.
అయితే జబీన బీసీ-ఈ కేటగిరిలోకి రాదని స్పష్టం చేశారు. జబీన్ సమర్పించిన ధృవ పత్రాల ప్రకారం కూడా ఆమె వెనుకబడిన వర్గాల జాబితాలోకి రారన్నారు. జబీన్ పదో తరగతి సర్టిఫికెట్, ఓటర్ లిస్టు, ఆమె ఎంపీటీసీగా నామినేషన్ వేసిన పత్రాలు కూడా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం టీడీపీలో బీసీ మహిళ అభ్యర్థి లేకుండా పోయారు.
ఇక, హైకోర్టులో స్టే వెకేట్ కావడంతో దుగ్గిరాల ఎంపీపీ కో ఆప్షన్, ఎంపీపీ, ఇద్దరు వైఎస్ ఎంపీపీలకు ఈనెల 5వ తేదీన ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో జరిగిన రెండు సమావేశాల సందర్భంగా తమ అభ్యర్థి జబీనకు కులధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని టీడీపీ సభ్యులు మీటింగ్కు హాజరు కాలేదు. దీంతో ఆ రెండు సార్లు కోరం లేక మీటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సారి కోరంతో సంబంధం లేకుండా ఎన్నిక జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.
దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో గురువారం 10గంటలకు కో ఆప్షన్ సభ్యుడి పదవికి నామినేషన్ల దాఖలు, మధ్యాహ్నం 12 గంటల లోపు నామినేషన్ల పరిశీలన, ఒంటిగంట తరువాత నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక జరుగుతుందని ఎంపీడీఓ కుసుమ శ్రీదేవి తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీల ఎన్నికతో ఈ ప్రక్రియ ముగియనుందని చెప్పారు. ఈ ఎన్నికల టర్నింగ్ అధికారిగా తాడేపల్లి ఎంపీడీఓ రామ్ ప్రసన్న వ్యవహరించనున్నారు.
గురువారం ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక, టీడీపీ, జనసేన అభ్యర్థులకు పటిష్ట భద్రత కల్పించాలని డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
మంగళగిరి నియోజవర్గం కావడంతో..
దుగ్గిరాల మండలం మంగళగిరి నియోజవర్గంలో ఉండటంతో ఈ ఎన్నికపై మరింత ఉత్కంఠ నెలకొంది. మంగళగిరి ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉండగా.. సీఎం జగన్ నివాసం కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది. మరోవైపు మంగళగిరి టీడీపీ ఇంచార్జ్గా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉన్నారు. దీంతో ఇరు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీపీ పీఠాన్ని ఎవరూ కైవసం చేసుకుంటారనేదానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.
టీడీపీ నుంచి అభ్యర్థి లేకపోవడంతో ఆ పార్టీ.. ఏ రకమైన వ్యుహాన్ని అనుసరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. లోకేష్ ఇంచార్జ్గా ఉన్న నియోజకవర్గం కావడంతో ఆయన ఏ వ్యుహాంతో ముందుకు వెళ్తారనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఇక, పార్టీ ఆదేశాలకు కట్టుబడి వ్యహరించాలని తమ పార్టీ ఎంపీటీసీలకు టీడీపీ విప్ జారీ చేసింది. విప్ జారీ చేసిన పత్రాలను ఎన్నికల రిట్నరింగ్ అధికారం రామ్ ప్రసన్నకు అందజేసినట్టుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు తాము ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎంపీపీ స్థానాన్ని గెలుచుకోపోబోతున్నామని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు.