గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే కన్నబాబురాజుని దొప్పెర్ల గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు.

విశాఖపట్టణం:అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం మండలం దొప్పెర్లలో వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబురాజుకి బుధవారంనాడు నిరసన తగిలింది.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వస్తున్న ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు చేతబూని నిరసనకు దిగారు. ఎమ్మెల్యేను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యేను అడ్డుకున్న దొప్పెర్ల గ్రామానికి వైసీపీకి చెందిన చిన్నారావు సర్పంచ్ గా ఉన్నారు. వైసీపీ సర్పంచ్ గా ఉన్న గ్రామంలోనే ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

12 ప్రశ్నలను వేసి వాటికి సమాధానం చెబితే గ్రామంలోకి రానిస్తామని గ్రామస్తులు తేల్చి చెప్పారు. గ్రామస్తులప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానం చెప్పినా కూడ గ్రామస్తులు సంతృప్తి చెందలేదు.దీంతో ఎమ్మెల్యే కన్నబాబు రాజు అక్కడి నుండి వెళ్లిపోయాడు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్న వైసీపీ ప్రజా ప్రతినిధులు నిరసనను ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. 

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోవైసీపీ ప్రజా ప్రతినిధులు ఏ మేరకు పాల్గొంటున్నారనే విషయమై సీఎం జగన్ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా ఏ ప్రజాప్రతినిధి ఎలాఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారనే విషయమై సీఎం జగన్ తన వద్దఉన్ననివేదిక ఆధారంగా ఆయా ప్రజాప్రతినిధులకు సూచనలు, సలహలు ఇస్తున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు.ఈ మేరకు గడప గడపకు మన ప్రభుత్వాన్ని వేదికగా ఎంచుకున్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు అందుతున్నాయా లేదా ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారనే విషయాలపై ప్రజలతో చర్చించాలని సీఎం జగన్ వైసీపీ ప్రజా ప్రతినిధులకు సూచించారు.

గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి న అసెంబ్లీ స్థానాలపై జగన్ ప్రస్తుతం కేంద్రీకరించారు. కుప్పం సహ మరో 18 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించాలని వైసీపీ నాయకులకు జగన్ దిశా నిర్ధేశం చేస్తున్నారు. ఇప్పటికే కుప్పం, అద్దంకి,టెక్కలి నియోజకవర్గాల సమీక్ష పూర్తైంది.