దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం, 11 మంది మృతి
అధిక వేగంగా పోతున్నపుడు డ్రైవర్ నిద్రమత్తులో తూలడం వల్ల ప్రమాదం జరిగివుండవచ్చని అనుమానిస్తున్నారు
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద ఈ తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 11 కు పెరిగింది.
ఒరిస్సా నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ముళ్లపాడు వద్ద ఈ బస్సు డివైడర్ను ఢీకొని కల్వర్టు కిందికి పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది చనిపోయారని మరొక 30 మంది గాయపడ్డారని పోలీసుల సమాచారం.
మరణించిన వారిలో కొొందరిని గుర్తించారు. వారి పేర్లు: కె.మధుసూదన్రెడ్డి (హైదరాబాద్), నలబోతు కృష్ణారెడ్డి (నల్గొండ), ఎస్కే బాషా(భవానీపురం, విజయవాడ), పంగా తులసమ్మ (సంతబొమ్మాళి, శ్రీకాకుళం), బస్సు డ్రైవర్ ఆదినారాయణ (తాడిపత్రి, అనంతపురం).
అధిక వేగంగా పోతున్నపుడు డ్రైవర్ నిద్రమత్తులో తూలడం వల్ల ప్రమాదం జరిగివుండవచ్చని అనుమానిస్తున్నారు.
మృతులలో అత్యధికులు శ్రీకాకుళం, విశాఖ, విజయవాడలకు చెందిన వారు. సంఘటనాస్థలంలోనే 9 మంది మరణించగా, ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందనీ, వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నామనీ వైద్యులు తెలిపారు
ఈ బస్సు (ఏపీ 02 టీసీ 7146) దివాకర్ ట్రావెల్స్ కు చెందినది. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
ఘటనాస్థలంలో సహాయచర్యలు చురుగ్గా చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కృష్ణా జిల్లా అధికారులను ఆదేశించారు.ప్రమాదం పై మంత్రి శిద్దారామయ్య విచారణకు ఆదేశించారు.
దివాకర్ ట్రావెల్స్ పై కేసు నమోదు
ప్రమాదానికి కారణమయిన బస్సు యజమాన్యం దివాకర్ ట్రావెల్స్పై కేసు నమోదు చేసి చేస్తున్నామని ఎపి డిజిపి సాంబశివరావు తెలిపారు. ఉదయం ఆయన ఘటనాస్థలిని డిజిపి పరిశీలించారు. రహదారి మలుపు వద్ద బస్సును వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. రహదారి డిజైన్లో ఏమైనా లోపాలు ఉన్నాయన్న అన్న కోణంలో నుంచి కూడా ప్రమాదాన్ని పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు.