ఏపీ శాసన మండలి రద్దుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి రద్దు అంశాన్ని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. మండలి రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. ప్రస్తుతం ఇది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి వివరించారు.
Also Read:జగన్ కోరిక తీరేనా: శాసన మండలి రద్దుకు కనీసం రెండేళ్లు
కాగా, జనవరి 27, 2020న మండలి రద్దుపై తీర్మానంపై ఏపీ శాసన సభలో ఓటింగ్ చేపట్టారు. మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ మినహా మిగతా సభ్యులందరూ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. 133మంది సభ్యులు మండలి రద్దుకు మద్దతు తెలిపారు. దీంతో తీర్మానం ఆమోదం పొందినట్లు ప్రకటించిన సభాపతి తమ్మినేని సీతారాం.. శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు. మండలి రద్దు తీర్మానం కేంద్రానికి చేరింది. దీంతో రాష్ట్రానికి సంబంధించినంత వరకూ మండలి కథ ముగిసినట్లే..! కేంద్రం తీసుకునే నిర్ణయంపై మండలి భవితవ్యం ఆధారపడి ఉంటుంది.