రాజకీయాల్లోకి పురంధేశ్వరి తనయుడు: జగన్ వైపేనా...
రాజకీయాల్లో ఆ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరూ రాజకీయ ఉద్దండులే. భర్త అయితే ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించారని ప్రచారం. ఇంతకీ ఆ కుటుంబం ఏంటి...ఆ వ్యక్తులు ఎవరు అనుకుంటున్నారా ఇంకెవరు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత సీఎం ఎన్టీఆర్ కుమార్తె దగ్గు బాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావులదే.
ప్రకాశం: రాజకీయాల్లో ఆ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరూ రాజకీయ ఉద్దండులే. భర్త అయితే ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించారని ప్రచారం. ఇంతకీ ఆ కుటుంబం ఏంటి...ఆ వ్యక్తులు ఎవరు అనుకుంటున్నారా ఇంకెవరు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత సీఎం ఎన్టీఆర్ కుమార్తె దగ్గు బాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావులదే.
రాజకీయాల్లో తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేసే వ్యక్తులు చాలా అరుదుగా చెప్తుంటారు. అలాంటి వారిలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకరు. మామ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దగ్గుబాటి ఓ వెలుగు వెలిగారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి రాష్ట్రరాజకీయాలతోపాటు దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు.
అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2004లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధీశ్వరి దంపతులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యేగా వెంకటేశ్వరరావు గెలుపొందగా, బాపట్ల ఎంపీగా పురంధీశ్వరి గెలుపొంది కేంద్ర కేబినెట్ లో న్యాయశాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు.
ఆతర్వాత జరిగిన 2009 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గెలవగా, ఆయన భార్య పురంధీశ్వరి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి గెలుపొంది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.
రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీ బీజేపీలో చేరారు. అయితే పురంధీశ్వరి బీజేపీలో యాక్టివ్ రోల్ ప్రదర్శిస్తున్నా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం రాజకీయాలకు దూరమయ్యారు. రాజకీయాల్లో కనుచూపు మేరలో ఎక్కడా కానరాకుండా పోయారు.
ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనయుడు హితేష్ చెంచురామ్ రాజకీయ భవితవ్యంపై దృష్టి సారించారట దగ్గుబాటి వెంకటేశ్వరరావు. పర్చూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని అందుకు తగ్గట్లుగా వ్యూహాలు రచిస్తున్నారు.
దగ్గుబాటి రాజకీయ అనుభవాన్ని గుర్తించిన వైఎస్ జగన్ గతంలో వైసీపీలోకి ఆహ్వానించారు. వైసీపీ దూతగా మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. పర్చూరు నియోజకవర్గం టిక్కెట్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి, బాపట్ల లోక్ సభ పురంధీశ్వరికి ఆఫర్ చేశారు. దానికి దగ్గుబాటి నో చెప్పేశారు.
అయితే తాజాగా జరుగుతున్న రాజకీయ పరినామాలను ఆసక్తిగా పరిశీలిస్తున్న దగ్గుబాటి తన కుమారుడిని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. పర్చూరు నియోజకవర్గం తనకు కంచుకోట కావడంతో ఆ నియోజకవర్గం అయితే తన కుమారుడికి కలిసొస్తుందని భావిస్తున్నారు.
ఒకప్పుడు ప్రస్తుత కాలంలో రాజకీయాలు చెయ్యలేము అన్న ఆయన ప్రస్తుతం తనయుడు రాజకీయ ఆరంగేట్రంపై చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. శ్రేయోభిలాషులతో పాటు కొందరు నాయకులు, ప్రజా ప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నారు.
తన కుమారుడు పోటీ చేసే విషయంపై చర్చించకుండా ప్రస్తుతం నెలకొన్నా పరిస్థితులు పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ప్రజల నాడీ ఎలా ఉంది రాజకీయంగా ఎవరిని స్వాగతించే అవకాశం ఉందో తెలుసుకునే పనిలో పడ్డారు దగ్గుబాటి.
ఇకపోతే రెండేళ్ల క్రితం చీరాల సముద్ర తీరంలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ నుఏర్పాటు చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ యూనిట్ నిర్వహణ బాధ్యత హితేష్ కి అప్పగించారు. ఆనాటి నుంచి నియోజకవర్గానికి వచ్చిపోతుంటున్నారు దగ్గుబాటి. ఏ చిన్న ఆహ్వానం అందినా రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు.
అయితే హితేష్ చెంచురామ్ కి లోకేస్ కు మంచి స్నేహం ఉంది. లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శితోపాటు ఏపీ మంత్రి కూడా కావడంతో హితేష్ చెంచురామ్ టీడీపీలోకి చేరతారంటూ వార్తలు వచ్చాయి. అయితే బీజేపీలో కీలక స్థానంలో ఉన్న పురంధీశ్వరి చంద్రబాబుపై విమర్శల దాడి చేశారు. దీంతో హితేష్ టీడీపీలోకి వెళ్లరని క్లారిటీ వచ్చేసింది.
అటు దగ్గుబాటి వెంకటేవ్వరరావు సైతం చంద్రబాబు పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఈఏడాది జూన్ 18న తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రతిపక్ష నేతగా జగన్ పనితీరు బాగుందని ఆయన పాదయాత్రతో వైసీపీ పుంజుకొందని అలాగే ప్రజల మద్దతు కూడా పెరిగిందని చెప్పుకొచ్చారు.
తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే అంశంపై చర్చ జరగుతుందని తెలిపారు. మరోవైపు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరంను చంద్రబాబు చేపట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ప్రాజెక్ట్ సాధ్యమయ్యేది కాదన్నారు. ఆ మండలాలను కలపకపోతే సీఎంగా ప్రమాణం చేసేదిలేదన్న చంద్రబాబు మాటలు తాను నమ్మనన్నారు దగ్గుబాటి.
మరోవైపు అమరావతి రాజధానిపై స్పందిస్తూ మహానగరాన్ని నిర్మించడం తప్పుకాదు. కానీ మూడు పంటలు పండే భూమిని ఎందుకు వినియోగించాల్సి వచ్చిందో ఆలోచించాలన్నారు. ఇది ఓ రకంగా దేశ సంపదను అడ్డుకోవడమేనని అభిప్రాయపడ్డారు. అలాగే పర్యావరణం, వికేంద్రీకరణ అంశాలపై కూడ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, తెలంగాణ సచివాలయం ఎన్ని ఎకరాల్లో ఉందో కూడా గమనించాలని హితవు పలికారు.
ఇలా జగన్ పై సానుకూలంగా మాట్లాడటంతో దగ్గుబాటి వైసీపీతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరుతుందంటూ ప్రచారం జరుగుతుంది.
మరోవైపు డిసెంబర్ 24న దగ్గుబాటి కుటుంబ సభ్యులు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోమన్ తో భేటీ అయ్యారు. కారంచేడులో ఇరువురూ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమంచి కూడా త్వరలోనే వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది.
ఆమంచికి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్నేహం ఉంది. అలాగే పర్చూరు నియోజకవర్గంలో ఆమంచి బంధుగణం పెద్ద ఎత్తున ఉంది. ఈ నేపథ్యంలో వారి మద్దతు కోరేందుకు ఆమంచిని కలిశారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. మెుత్తానికి దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీలో చేరుతుందా, హితేష్ చెంచురామ్ కు వైసీపీ పర్చూరు టిక్కెట్ ఆఫర్ లో వాస్తవమెంత తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.