బిజెపితో వైసీపీ మెతకవైఖరి ఎందుకో చెప్పాలి: బీవీ రాఘవులు
బిజెపిపై బీవీ రాఘవులు విమర్శలు
అమరావతి:జమిలీ ఎన్నికల పేరుతో బిజెపి ప్రమాదకర ఎత్తుగడకు శ్రీకారం చుట్టబోతోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. ఈ విధానాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ విషయమై తమ పార్టీకి చెందిన కేరళ సీఎం పినరయి విజయన్ ఇతర రాష్ట్రాల సీఎంలతో చర్చిస్తున్నారని ఆయన చెప్పారు.
విజయవాడలో సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.పార్లమెంటరీ విధానాన్ని దెబ్బతీసేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరశైలి ఫెడరల్ స్పూర్తికి విరుద్దంగా ఉందన్నారు.
మోడీకి అనుకూలంగా నీతి ఆయోగ్ పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ఫెడరల్ స్పూర్తిని కాపాడేందుకు తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఏపీకి చట్టబద్దంగా కల్పించిన హక్కులను ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గతంలో కూడ అధ్యక్ష తరహ పాలనను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే తాము వ్యతిరేకించినట్టుగా ఆయన గుర్తు చేశారు. జమిలీ ఎన్నికల విషయంలో కూడ ఇదే తరహలో పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
బిజెపితో వైసీపీ మెతక వైఖరిని అవలంభించడంపై ఆయన మండిపడ్డారు. బిజెపితో వైసీపీ ఎందుకు మెతక వైఖరిని అవలంభిస్తోందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతర్గత ఒప్పందాలు చేసుకోవడంలో టిడిపి ఫస్ట్ ఉందన్నారు.