రిషికొండలో నిర్మాణాలను  పరిశీలించేందుకు  సీపీఐ  జాతీయ  కార్యదర్శి  నారాయణను మాత్రమే  పోలీసులు అనుమతి ఇచ్చారు. సీపీఐ ఏపీ  రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  సహా  ఇతర  నేతలను  కూడా  అనుమతించాలని పోలీసులతో  వాగ్వాదానికి  దిగారు. దీంతో  ఉద్రిక్తత  చోటు  చేసుకుంది.

విశాఖపట్టణం: ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా రిషికొండలో శుుక్రవారంనాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైకోర్టు అనుమతితో రిషికొండను పరిశీలించేందుకు వెళ్లిన నారాయణ సహా సీపీఐ నేతలను పోలీసుులు అడ్డుకున్నారు. రిషికొండలో నిర్మాణాలను పరిశీలించేందుకు సీపీఐ జాతీయ కార్యదర్శి ఒక్కరినే అనుమతించారు పోలీసులు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, విశాఖ జిల్లాకు చెందిన సీపీఐ నేతలను కూడా రిషికొండకు వెళ్లేందుకు పోలీసులు నిరాకరించారు. టూరిజం శాఖకు చెందిన వాహనంలోనే పోలీసులు నారాయణను తీసుకెళ్లారు. రిషికొండకు సమీపంలోనే రామకృష్ణ సహా ఇతర సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకొన్నారు. నారాయణతో పాటు తమను కూడా పంపాలని సీపీఐ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రిషికొండలో నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు తీయవద్దని కూడ ఆంక్షలు విధించారు. దీంతో పోలీసుల తీరుపై సీపీఐ నేతలు మండిపడ్డారు. 

రిషికొండలో గతంలో టూరిజానికి చెందిన భవనాలున్నాయని సీపీఐ నేతలు గుర్తు చేస్తున్నారు. రిషికొండలో నిర్మాణాల విషయాల్లో బయటకు చెప్పేదొకటి ప్రభుత్వం మరో రకంగా చేస్తుందని సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా రిషికొండను పరిశీలించేందుకు సీపీఐ నారాయణ వెళ్లేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నారని సీపీఐ నేతలు గుర్తు చేశారు. దీంతో హైకోర్టు అనుమతిని తీసుకొని నారాయణ రిషికొండకు వెళ్లాల్సి వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గుర్తు చేస్తున్నారు. రిషికొండకు తమను ఎందుకు అనుమతించడం లేదో చెప్పాలని సీపీఐ నేతలు ప్రశ్నిస్తున్నారు. రిషికొండలో పర్యావరణానికి హాని కల్గించే నిర్మాణాలు చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ, జనసేనతో పాటు తమ పార్టీకి చెందిన నేతలను కూడా రిషికొండను చూడడానికి వెళ్లనివ్వలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గుర్తు చేశారు. 

also read:అధికార పార్టీనే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతుంది.. : వైసీపీపై సీపీఐ నారాయణ ఫైర్

రిషికొండలో నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్లిన తనను అడ్డుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు రిషికొండలో నిర్మాణాల పరిశీలనకు హైకోర్టు అనుమతించింది. నవంబర్ మొదటి వారంలో ఈ నిర్మాణాలను పరిశీలించాలని కోరింది. అయితే ఆ సమయంలో తనకు వీలు కాదని నారాయణ హైకోర్టుకు తెలిపారు. ఇవాళ రిషికొండలో నిర్మాణాల పరిశీలనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.