జైలుకెళ్లడమే జగన్ కు కలిసొచ్చింది... లేదంటే: సిపిఐ నారాయణ సంచలనం
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ, రైతు చట్టాలకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో వాపపక్షాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి.
విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జైలుకు వెళ్లడం జగన్ కు కలిసివచ్చిందని... ఆ కారణంగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. లేకుంటే ఎప్పటికీ సీఎం అయ్యేవారు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ, రైతు చట్టాలకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో వాపపక్షాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో పాల్గొన్న నారాయణ కేంద్రంపైనే కాదు రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిలపై మండిపడ్డారు.
read more బిజెపి వ్యూహం ఇదీ: జట్టులోకి వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ కు చిక్కులు?
రాష్ట్రంలో అధికారంలో వున్న వైసిపి స్వార్థ రాజకీయాలు చేస్తోందని... అందులోభాగంగానే కేంద్రంతో లాలూచీ పడుతోందన్నారు. కేంద్రం రైతులకు అన్యాయం చేస్తూ తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకించాల్సింది పోయి వాటికి సపోర్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. ఈ స్వార్థపూరిత నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతోందని నారాయణ మండిపడ్డారు.
ఇక మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడి వ్యవహారం కూడా అలాగే వుందన్నారు. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారని అన్నారు. కేంద్రం ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహారిస్తోందని ఆరోపించారు. కార్పొరేటు కంపెనీలకు లబ్ది చేకుర్చేలా, రైతులకు అన్యాయం చేసేలా తీసుకువచ్చిన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి నారాయణ డిమాండ్ చేశారు.