వీగిపోతున్న సిబిఐ కేసులు
- ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి ఎల్పీ సుబ్రమణ్యంపై సిబిఐ నమోదు చేసిన కేసు వీగిపోయింది.
ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి ఎల్పీ సుబ్రమణ్యంపై సిబిఐ నమోదు చేసిన కేసు వీగిపోయింది. సమైక్య రాష్ట్రంలో సుబ్రమణ్యంపై సిబిఐ పలు ఆరోపణలు చేస్తూ సిబిఐ కేసు నమోదు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు కూడా ఒకటి. ఐఏఎస్ అధికారిపై కేసు నమోదు చేసిన సిబిఐ దాన్ని నిరూపించటంలో విఫలమైందని కోర్టు అభిప్రాపయడింది.
ఎమ్మార్ కు జరిగిన భూ కేటాయింపులు, ధర నిర్ణయం అంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరిగిందని కోర్టు అంగీకరించింది. సుబ్రమణ్యం వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం ఏమీ లేదని, అంతా మంత్రివర్గ నిర్ణయాల ప్రకారమే నడుచుకున్నట్లు కోర్టు ధృవీకరించింది.
జగన్ పై సిబిఐ అక్రమాస్తులకు సంబంధించి అనేక కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే జగన్ తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులను, కార్పొరేట్ యాజమాన్యాలను సిబిఐ అరెస్టు చేసింది. గడచిన ఆరు సంవత్సరాలుగా వివిధ కేసులు కోర్టుల్లో విచారణ జరుగుతున్నప్పటికీ ఒక్క కేసు కూడా సిబిఐ నిరూపించలేకపోయింది.
దాంతో ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులపై నమోదైన కేసులను కోర్టు కొట్టేసింది. అలాగే, పలువురు కార్పొరేట్ యాజమాన్యాలకు కూడా కేసుల్లో నుండి ఊరట లబించింది. ఈ నేపధ్యంలో జగన్ పై నమోదైన కేసులు కూడా త్వరలో వీగిపోతాయని జగన్ తో పాటు వైసిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. తానెటువంటి తప్పు చేయలేదని జగన్ కూడా మొదటి నుండి చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి తనపై నమోదైన కేసులన్నింటినీ కోర్టు త్వరలోనే కొట్టేస్తుందని జగన్ ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు.