కోర్టుకెక్కిన వివాదం
- స్వరూపానందస్వామిపై కేసు
- కేసు దాఖలు చేసిన షిరిడీ సంస్ధాన్
- ద్వారకా పీఠాధిపతికి ఇన్జెక్షన్ ఆర్డర్
నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏమి అవుతుందో ద్వారకా పీఠాధిపతి అంశమే తాజా ఉదాహరణ. దేశంలోకెల్లా ప్రసిద్దిచెందిన పీఠాల్లో ద్వారకా పీఠం కూడా ఒకటి. అయితే పీఠాధిపతి స్వరూపానంద తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రచారానికి ఎక్కుతుంటారు. వివాదాలు రేకెత్తించటం ఆయనకు అలవాటుగా మారింది. ఇందులో భాగంగానే ఇటీవలే షిరిడీ సాయిపై నోరు పారేసుకున్నారు. షిరిడీసాయి అసలు దేవుడే కాదన్నారు. అంతటి ఆగకుండా కొందరు బూతాలు దేవుడి పేరుచెప్పుకుని పూజలందుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.
పెద్దాయన ఏదో మాట్లాడారు లెమ్మని భక్తులు సరిపెట్టుకుంటే మళ్లీ రెచ్చగొట్టారు. షిరిడీ సాయిని తెలుగు ప్రజలు ఇళ్ళలో పెట్టుకుని పూజిస్తున్నారని, తాము పూజించేది ఒక దయాన్ని, బూతాన్ని అని తెలుసుకోలేకున్నారంటూ భక్తులను రెచ్చ గొట్టారు. దాంతో ఇరు రాష్ట్రాల్లోని సాయి భక్తులు రోడ్లపైకి వచ్చారు. పీఠాధిపతికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. అప్పటికైనా స్వరూపానంద స్వామి ఆగివుంటే బాగుండేది.
కానీ షిరిడీసాయిపై తన వ్యాఖ్యలకు కట్టుబడి వుంటానంటూ మళ్ళీ ప్రకటించారు.దాంతో హైదరాబాద్ లోని దిల్ షుఖ్ నగర్ షిరిడీసాయి సంస్ధాన్ నిర్వాహకులు పీఠాధిపతిపై సిటీ సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసారు. సదరు పిటీషన్ ను విచారించిన కోర్టు షిరిడీసాయిపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని చెబుతూ ఇన్ జెక్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఫిరిడీసాయిపై మళ్ళీ ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరికలు కూడా జారీ చేసి కేసు విచారణను వాయిదా వేయటం గమనార్హం.