దొంగల పని కాదు.. అవమానించాడని మాజీ ఉద్యోగి ఘాతుకం, నెల్లూరు జంట హత్యల వెనుక వీడిన మిస్టరీ
నెల్లూరులో దంపతుల హత్యను పోలీసులు ఛేధించారు. తనను అందరిముందు అవమానించాడనే అక్కసుతో మాజీ ఉద్యోగి దంపతులను మరో వ్యక్తితో కలిసి కిరాతకంగా హతమార్చాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నెల్లూరు అశోక్ నగర్ జంట హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ మేరకు శివ, రామకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణతో కలిసి కృష్ణారావు, సునీతలను హత్య చేశాడు శివ. గతంలో కృష్ణారావు క్యాంటీన్లో పనిచేశాడు శివ. అయితే తనను అందరిముందు అవమానించాడని అతను కక్ష పెంచుకుని దంపతులను హత్య చేశాడు.
కాగా.. నెల్లూరు నగరంలోని అశోక్ నగర్లో వుంటోన్న వాసిరెడ్డి కృష్ణారావు, సునీత దంపుతులు ఆదివారం దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. కృష్ణారావు కరెంట్ ఆఫీస్ వద్ద క్యాటరింగ్, హోటల్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రి హోటల్ మూసేసిన తర్వాత 12 గంటలకు ఇంటికి వచ్చేవారు . ఈ క్రమంలోనే శనివారం రాత్రి కూడా భర్త ఇంటికి వస్తారనే ఉద్దేశంతో సునీత తలుపులకు తాళం వేయకుండా బెడ్రూమ్లో నిద్రకు ఉపక్రమించారు.
Also REad:నెల్లూరులో దారుణం: దంపతుల హత్య, బంగారు ఆభరణాలు చోరీ
ఈ విషయాన్ని గమనించిన దుండగులు లోనికి ప్రవేశించి.. సునీత తలపై కర్రతో మోదారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఇంట్లో దోపిడీకి యత్నించి.. కొంత నగదు తీసుకుని ఊడాయించారు. అయితే ఇంటి బయటే కృష్ణారావు ఎదురుపడ్డారు. కానీ స్థానికులను అప్రమత్తం చేసేలోపే ఆయన గొంతును కత్తితో కోసి పరారయ్యారు. దీంతో కృష్ణారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం పనిమనిషి వీరిద్దరి మృతదేహాలను చూసి బంధువులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘటనాస్థలిని పరిశీలించారు.