సారీ అమ్మా నాన్న... నాకు బ్రతకాలని లేదు..: అనంతపురంలో కార్పోరేట్ కాలేజ్ లెక్చరర్ సూసైడ్
ప్రముఖ కార్పోరేట్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేసే యువతి ఆత్మహత్య అనంతపురంలో కలకలం రేపింది. చిన్న వయసులోనే లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న యువతి ఆత్మహత్యతో అనంతపురంలో విషాదం నెలకొంది.
అనంతపురం : కార్పోరేట్ విద్యాసంస్థల్లో చదువుల ఒత్తిడికి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అనేకం. కానీ తాజాగా కార్పోరేట్ కాలేజీ లెక్చరర్ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కాలేజీ నుండి బయటకు వెళ్ళిన లెక్చరర్ రైలుపట్టాలపై విగతజీవిగా మారింది.
వివరాల్లోకి వెళితే... అనంతపురం పట్టణంలోని ప్రముఖ కార్పోరేట్ కాలేజీ నారాయణలో ప్రత్యూష(26) ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తోంది. అయితే ఈమె తరచూ అనారోగ్య సమస్యతో బాధపడేది. అప్పుడప్పుడు విపరీతమైన కడుపునొప్పితో తీవ్ర నరకయాతన అనుభవించేది. ఎంతమంది వైద్యులను సంప్రదించినా కడుపునొప్పి తగ్గకపోవడంతో ప్రత్యూష తీవ్ర మనోవేదనకు గురయ్యింది. ఈ బాధను భరించడం కంటే చావడమే మేలనుకుందో ఏమో గత శుక్రవారం దారుణానికి పాల్పడింది.
read more బెజవాడలో చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు.. బాలుడు మృతి
ఉదయం ఇంటినుండి కాలేజీకి చేరుకున్న ప్రత్యూష కొన్ని క్లాసులను పూర్తిచేసుకుని పని వుందంటూ పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్లింది. అయితే నేరుగా ఆమె సమీపంలోని రైలు పట్టాలవద్దకు వెళ్ళి ఓ గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. గూడ్స్ రైల్ దూసుకెళ్లడంతో ప్రత్యూష శరీరభాలలు రైలుపట్టాలపై పడ్డాయి.
ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహం పక్కనే పట్టాలవద్ద పడివున్న యువతి బ్యాగ్ ను గుర్తించారు. అందులో తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ రాసిన సూసైడ్ లెటర్ లభించింది.
'''సారీ అమ్మా, నాన్న, అన్నయ్య, బన్ని. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా చావుకు నేనే కారణం. నాన్న అమ్మని బాగా చూసుకో. ఓకే నా. నేను చావడానికి కారణం ఏమీ లేదు. నాకు బ్రతకాలని లేదు. అందుకే చచ్చయిపోతున్నా. సారీ'' అంటూ యువతి సూసైడ్ లెటర్ లో పేర్కొంది.
యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమ కూతురు ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలు లేవని... అనారోగ్య కారణంతోనే ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు.