బోర్డర్లో చెక్పోస్టుల ఎత్తివేత అవాస్తవం, త్వరలో తెలంగాణకి బస్సులు: కృష్ణబాబు
రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులను రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టిపారేశారు ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, కోవిడ్ 19 టాస్క్ఫోర్స్ ఛైర్మన్ కృష్ణబాబు.
రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులను రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టిపారేశారు ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, కోవిడ్ 19 టాస్క్ఫోర్స్ ఛైర్మన్ కృష్ణబాబు. కరోనా మార్గదర్శకాల ప్రకారం సరిహద్దు చెక్పోస్టులన్నీ లాక్డౌన్ ముగిసే వరకూ కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
చెక్పోస్టులకు సంబంధించి పలు టీవీ ఛానెల్స్, వార్తాపత్రికల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని కృష్ణబాబు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే వారంతా ఖచ్చితంగా స్పందన వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సిందేనని ఆయన వెల్లడించారు.
Also Read:తెలంగాణ సర్కార్ సంచలనం: ఇకపై కరోనా పాజిటివ్ రోగులకు ఇంట్లోనే చికిత్స
ఇందుకు తగ్గట్టుగా ప్రయాణాలు నిర్వహించుకోవాలని... కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఆరు రాష్ట్రాలు ( మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్ధాన్) నుంచి వచ్చే వారు తప్పనిసరిగా ఏడు రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్లో ఉండాలని కృష్ణబాబు వెల్లడించారు.
అలాగే తెలంగాణకు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా వున్నామని, అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక బస్సులు నడుపుతామని ఆయన తెలిపారు. కాగా తెలంగాణ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పడానికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమవుతోంది.
Also Read:కరోనా కలకలం: న్యూఢిల్లీ ఏపీ భవన్లో అధికారికి కరోనా, ఆఫీసుల మూసివేత
బస్సులు తిప్పడానికి అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాసిన సంగతి తెలిసిందే.