మంగళగిరి పోలీసులు మరింత కఠినంగా ... కరోనా నియంత్రణకు కీలక నిర్ణయాలు
పట్టణంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ(సోమవారం) మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు.
గుంటూరు: కరోనా నియంత్రణ కోసం ఇంకా కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు మంగళగిరి మున్సిపల్ అధికారులు సూచించారు. పట్టణంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ(సోమవారం) మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. ఈ క్రమంలో కరోనా నియంత్రణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇకపై 15కేసులు దాటిన వార్డులను కంటోన్మెంట్ పరిధిలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నెల 28 నుండి ఇది అమలు చేయాలని అధికారులు సూచించారు. ఈరోజు, రేపు ఆయా పరిధిలోని ప్రజలు నిత్యావసర సరుకులు సమకూర్చుకోవాలి సూచించారు.
ఈ నిర్ణయంతో మంగళగిరి పట్టణంలోని 24 వార్డులు కంటోన్మెంట్ పరిధిలోకి వెళ్లనున్నాయి. రూరల్ లో నవులూరు 2, నిడమర్రు 1,2, బేతపూడి,నూతక్కి 1,2 సచివాలయలు కాకుండా మిగిలినవి అన్నీ కంటోన్మెంట్ క్రిందకు వెళ్లనున్నాయి.కంటోన్మెంట్ పరిధిలో పాలు, నిత్యావసరాలు మెడిసిన్ కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.
read more కరోనా కల్లోలం : కంటైన్మెంట్ జోన్ గా తిరుపతి.. !
ఇదిలావుంటే రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సెకండ్ వేవ్ లో ఈ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇప్పటికే ఢిల్లీ లాంటి నగరాల్లో ఆక్సీజన్ అందక పలువురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోగా తాజాగా అదే పరిస్థితి విజయనగరం జిల్లాలోనూ ఏర్పడింది.
విజయనగరం జిల్లాలోని మహారాజ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. ఆక్సిజన్ కొరతతో నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో అర్ధరాత్రి నుంచి తీవ్ర ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో కరోనా రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రోగుల బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగడంతో భారీగా పోలీసులు మోహరించారు.