విశాఖ క్వారంటైన్ సెంటర్లో అగ్ని ప్రమాదం: తప్పిన పెను ముప్పు (వీడియో)
విశాఖ జిల్లా మధురవాడ మారికవలసలో ఉన్న క్వారంటైన్ కేంద్రంలో సోమవారం నాడు షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది. ఈ కేంద్రంలో 64 మంది కొవిడ్ రోగులున్నారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
విశాఖపట్నం: విశాఖ జిల్లా మధురవాడ మారికవలసలో ఉన్న క్వారంటైన్ కేంద్రంలో సోమవారం నాడు షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది. ఈ కేంద్రంలో 64 మంది కొవిడ్ రోగులున్నారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
మారికవలస శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మెుదటి అంతస్తులో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ పై అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్ నుంచి మంటలు వచ్చాయి. అక్కడే ఉన్న కొవిడ్ సిబ్బంది వెంటనే స్పందించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పక్కనే ఉన్న మరో భవనంలోకి తరలించారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఘటన స్థలాన్ని జాయింట్ కలెక్టర్ గోవిందరాజు నార్త్ జోన్ ఏసీబీ రవిశంకర్ రెడ్డి పరిశీలించారు.
అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని కరోనా రోగులు అభిప్రాయపడుతున్నారు.రాష్ట్రంలోని విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ లో ఈ నెల 10 వ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు.
"