ఏపీలో కాంగ్రెస్ ప్లాన్ ఇదే: కిరణ్ వ్యూహం ఫలించేనా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ గందరగోళంలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఈ సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకొన్నారు
విజయవాడ: కాపు రిజర్వేషన్లపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ గందరగోళంలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఈ సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకొన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుండి ఇంటింటికి కాంగ్రెస్ లో భాగంగా ప్రత్యేక హోదాతో ఇతర అంశాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.
ఏపీ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం బుధవారం నాడు జరిగింది.ఈ సమావేశంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఏపీలో పార్టీని బలోపేతం చేసే విషయమై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని కొందరు పార్టీ నేతలు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు.
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన విషయమై చర్చించారు. ఆయా జిల్లాల్లోని పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల నేతలను మార్చాలని కూడ ఈ సమావేశంలో చర్చించారు. కొన్ని జిల్లాల అధ్యక్షుల పనితీరు బాగా లేదని వారిని మార్చాలని మాజీ మంత్రి శైలజానాథ్ ఈ సమావేశంలో ప్రస్తావించారు.
జాతీయ పార్టీలతోనే ఏపీకి న్యాయం జరిగే అవకాశం ఉందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి సమావేశంలో చెప్పారు. ప్రత్కేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనే విషయాన్ని ప్రజలకు వివరించాలని కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు.
ఈ వార్త చదవండి:ఏ పార్టీతోనూ పొత్తు లేదు, మరిన్ని చేరికలు: ఉమెన్ చాందీ