కాంగ్రెస్ పాత 'కాపుల' వ్యూహం: జగన్కు దెబ్బేనా?
కాంగ్రెస్ బలపడితే వైసీపీకి దెబ్బేనా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైతే రాజకీయంగా వైసీపీకి నష్టమయ్యే అవకాశం కూడ లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.అదే జరిగితే అధికార టీడీపీకి ప్రయోజనం కల్గించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.
2014లో ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలుగా విడిపోయింది.రాష్ట్రాన్ని విభజించారనే కోపంతో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కకుండా చేశారు ప్రజలు. పోటీ చేసేందుకు కూడ అభ్యర్ధులు దొరకని పరిస్థితి నెలకొంది. పోటీ చేసిన స్థానాల్లో డిపాజిట్లు కూడ దక్కలేదు.
రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు అవుతోంది. అయితే ఏపీలో రాజకీయ పరిణామాలు కూడ మారుతున్నాయి. ఈ తరుణంలోనే కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీని కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర ఇంచార్జీగా ఆ పార్టీ నియమించింది.
ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉమెన్ చాందీ ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకొంటున్నారు. రాష్ట్ర విభజనకు ముందు సమయంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించే చర్యలు తీసుకొంటున్నారు. మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్కుమార్రెడ్డిలతో కూడ చర్చలు జరిపారు.
పాత కాపులను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు ఉమెన్ చాందీ సూచనల మేరకు పార్టీ నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైతే వైసీపీ రాజకీయంగా నష్టమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు
గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, బీజేపీ కూటమి మధ్య ముఖాముఖి పోటీ జరిగింది. కానీ, 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇప్పటికున్న పరిస్థితుల ప్రకారంగా జనసేన , లెఫ్ట్ పార్టీలు, లోక్సత్తాలు కూటమిగా పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోందా.. ఏదైనా పార్టీతో కలిసి పొత్తుతో ఉంటుందా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
వైసీపీ మాత్రం తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. బీజేపీ కూడ ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్ధులు నామమాత్రంగానే ఓట్లను సంపాదించారు.
అయితే వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంత బలోపేతమైతే ఆ మేరకు వైసీపీకి నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల ప్రభావం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లు కూడ వైసీపీకి కలిసివచ్చాయనే అభిప్రాయాలు లేకపోలేదు.
కాంగ్రెస్ పార్టీ బలపడితే కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయికంగా పట్టున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లను వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు చీల్చుకొనే అవకాశాలు లేకపోలేదు. వైసీపీ ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీల్చితే పరోక్షంగా టీడీపీకి ప్రయోజనం కల్గించే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
వైసీపీకి వచ్చే ఓట్లలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లే... దీంతో ఈ ఓట్లలో చీలిక ఏర్పడే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు జనసేన, లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీ చేసి, బీజేపీ, కాంగ్రెస్, వైసీపీలు వేర్వేరుగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే టీడీపీకి రాజకీయంగా కలిసొచ్చే అవకాశం లేకపోలేదు.