ఏపీలో కేంద్ర పథకాల పేర్ల మార్పుపై ఫిర్యాదు.. వివరణ కోరిన స్మృతి ఇరానీ
కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి అమలు చేసే పథకాలను తమ పథకాలుగా పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుందని ఎంపీ రఘురామ ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర మంత్రి స్పందించారు. తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏపీ ప్రభుత్వం మారుస్తోందంటూ వచ్చిన ఫిర్యాదుపై కేంద్రం సీరియస్ అయ్యింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ పథకాలకు కొత్త పేర్లు ఎలా పెడుతారంటూ ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇస్తున్న పథకాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పేర్లు పెట్టుకోవడం మంచి పద్ధతి కాదని తెలిపారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఫిర్యాదుతో..
ఏపీలో కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి అమలు చేసే పథకాలకు వైసీపీ ప్రభుత్వం పేర్లు మార్చి అమలు చేస్తోందంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కలిసి రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర పథకాలు, లబ్ది పొందుతున్న వైసీపీ తీరును ఎంపీ వివరించారు. పోషణ్ అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే.. దానిని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు అని పేర్లు పెట్టి అమలు చేస్తున్నారని ఎంపీ రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేంద్ర మంత్రి వెంటనే స్పందించారు. కేంద్ర పథకాల పేర్లు మార్చడం సరైన పద్దతి కాదని మండిపడ్డారు. దీనిపై వెంటనే తనకు వివరణ కావాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐసీడీఎస్, ఐసీపీఎస్ తాము కేటాయించిన నిధుల లెక్క చెప్పాలని అన్నారు. ఈ వ్యవహారంపై తనకు సమగ్ర నివేదిక కావాలని ఆదేశాలు జారీ చేశారు.
పేర్లు మార్చడం ఇదే మొదటిసారా ?
కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఇదే ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే పేర్లు మార్చి అమలు చేసుకున్నారు. దీనిపై ఆ రాష్ట్ర బీజేపీ సర్కార్ తీవ్ర అభ్యంతరాలు తెలిపింది. అయినా అప్పటి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ఇప్పుడు వైసీపీ కూడా ఇలానే చేస్తోందని ఎంపీ రఘురామ ఇచ్చిన ఫిర్యాదుతో వార్తల్లోకి ఎక్కింది.
ఇలా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని పూర్తి స్థాయిలో పేర్లు మార్చకుండా.. కొంత మార్పుతో పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణకు పలు పథకాల కింద కేంద్రం కేటాయించే నిధులను రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాల కింద ఖర్చు చేస్తోంది. అయితే కేంద్ర ఏ ఉద్దేశంతో నిధులు ఇస్తోందో, ఆ పనుల కోసం మాత్రమే ఖర్చు చేస్తుండటంతో ఎలాంటి సమస్య రావడం లేదు. ఉదహారణకు కేంద్ర ఉపాధి హామీ పథకం కింద నిధులను కేటాయిస్తోంది. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం శ్మశాన వాటిక నిర్మాణాలకు, రైతు వేధికలు, మొక్కల పెంపకానికి వెచ్చిస్తోంది. అలాగే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేంద్ర పంపించే నిధుల్లో కొంత రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని రూపాయికే కిలో బియ్యాన్ని అందిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు కూడా ఇలా తమకు అనువుగా కేంద్ర ప్రభుత్వ నిధులను, పథకాలను వారికి అనువుగా మార్చుకొని అమలు చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వంపై వచ్చిన ఫిర్యాదుపై ఆ రాష్ట్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.